బంజారాహిల్స్, జూన్ 21: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యేడు 1.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని లోటస్పాండ్లో సోమవారం చేపట్టిన గ్రీన్ చాలెంజ్లో ఆమె పాల్గొన్నారు. ఎంపీ సంతోశ్కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సినీ నటుడు తరుణ్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో పచ్చదనం పెంపు లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నదన్నారు. ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని అన్నారు. నగరంలోని 919 బహిరంగ ప్రదేశాలను జీహెచ్ఎంసీ పార్కులుగా అభివృద్ధి చేశామని.. 405 లే అవుట్లోని ఖాళీ స్థలాలను ట్రీ పార్కులుగా తీర్చిదిద్దామని తెలిపారు. తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనాన్ని పెంచేలా మియావాకి ప్లాంటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. గ్రేటర్ పరిధిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేకంగా పది శాతం బడ్జెట్ను కేటాయించామని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోశ్కుమార్ చేపట్టిన గ్రీన్చాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రశంసించారు.
మేయర్ గద్వాల విజయలక్ష్మి తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు మేయర్ నివాసానికి వచ్చిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నం.1లోని కాజా మాన్షన్ ఫంక్షన్ హాల్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం రక్తదానం చేశారు.
మహా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో ఆమెరికన్ క్యాన్స ర్ దవాఖానలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పేదలకు ఆధునిక వైద్య సేవలందించడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆమెకు చీరను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దవాఖానలోని చిన్నారులు, వృద్ధులు, రోగు లకు మేయర్ పండ్లు పంపిణీ చేశారు.