నాలాల్లో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
అధికారులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశం
నగరంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటేషన్లు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంటమాలజీ అధికారులను ఆదేశించారు.నగరంలో ఉన్న ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు మరిన్ని పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మేయర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న అభివృద్ధి, స్వచ్ఛ కార్యక్రమాలపై జోనల్ వారీగా సమీక్ష సమావేశాలకు మేయర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఖైరతాబాద్ జోన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ప్రావీణ్య, సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, వైద్యాధికారులు ఇతర విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రుతుపవనాల ప్రవేశానికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నందున ఈ రెండు నెలల్లో నాలాల పూడిక తీత పనులను పూర్తి చేయాలని మేయర్ సూచించారు.
హైదరాబాద్ నగరంలో గ్రీనరీని పెంపొందించడంతో పాటు నగర సుందరీకరణకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని బిన్లెస్ సిటీగా మార్చడాన్ని ప్రస్తావిస్తూ వీధుల్లో పేరుకుపోయే చెత్తను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని మేయర్ సూచించారు. పబ్లిక్ టాయిలెట్ల పర్యవేక్షణను సమీపంలోని స్ట్రీట్ వెండర్లకు అప్పగించాలని తెలిపారు. 60 ఏండ్లకు పైబడిన పారిశుధ్య కార్మికులను గుర్తించి వారి స్థానంలో వారు సూచించిన కుటుంబ సభ్యులకు నియామకాలు జరుపాలని మేయర్ ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో నగర పౌరులను భాగస్వామ్యం చేసేందుకు పరిచయం కార్యక్రమం, శానిటేషన్ సిబ్బంది వివరాలను తెలిపే వాల్ రైటింగ్లను తిరిగి ప్రారంభించాలని మేయర్ ఈ సందర్భంగా ఆదేశించారు.