మహా నగరంలో పేరుకుపోయిన చెత్త, పారిశుధ్య పనులపై నిర్లక్ష్యంగా ఉండొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు హితవు పలికారు. గ్రేటర్లోని పలు ప్రాంతాలలో పారిశుధ్య పనులపై మంగళవారం మేయర్ ఆకస్మిక పర్యటన చేశారు. తొలుత నాంపల్లి స్టేషన్ రోడ్డులో పారిశుధ్య పనులను పరిశీలించి అక్కడి నుంచి కోఠి ఈఎన్టీ దవాఖానను సందర్శించారు. జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి దవాఖానలో జరుగుతున్న పారిశుధ్య పనులను, హాస్పిటల్లోని అన్ని బ్లాక్లను పరిశీలించి అక్కడ కరోనా పేషెంట్ల కోసం చేసే ఏర్పాట్లను మేయర్ పర్యవేక్షించారు. తర్వాత మలక్పేట, మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంబర్పేట అలీ కేఫ్ వద్ద, అన్నపూర్ణ నగర్, వెంకటేశ్వర నగర్, జిందా తిలిస్మాత్ రోడ్డులో చెత్తను చూసిన మేయర్ స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఆటో రావడం లేదని తెలుసుకొని సదరు ఆటో వారిని పిలిపించి రోజూ కచ్ఛితంగా ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టాలని ఆదేశించారు. డీసీ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలతకు ఎస్ఎఫ్ఏలు పని చేయకపోతే వారి స్థానంలో కొత్త వారిని పెట్టాలని ఆదేశించారు. 50 ఏండ్లు దాటిన పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించే విధంగా చూడాలని చెప్పారు. ఎంటమాలజీ విభాగం ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. గోల్నాక, కాచిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, పలు చోట్ల ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం గమనించిన మేయర్ త్వరలో వీటిపై ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని అన్నపూర్ణ సెంటర్లలో ఐదు రూపాయలకు లభిస్తున్న భోజనాన్ని మంగళవారం నుంచి ఉచితంగా ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. 250 సెంటర్ల అన్నపూర్ణ సెంటర్ల ద్వారా నగర వ్యాప్తంగా రోజూ 45,000 మందికి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. సోమవారం వరకు 30 సర్కిళ్లలో 1,680 బృందాలలో 9,98,373 మందికి ఫీవర్ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. బస్తీ దవాఖానలలో మొత్తం ఓపీల ద్వారా 2,19,333 మందికి ఫీవర్ టెస్ట్లు చేయడం జరిగిందని చెప్పారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.