ఆధునిక సాగు వైపు అన్నదాతల అడుగులు
పామాయిల్, కొబ్బరి సాగుపై దృష్టి
అంతర పంటగా కో-కో, వక్క, మిరియం
అధిక లాభాలు గడిస్తున్న పేట రైతులు
ఈ ఏడాది ప్రారంభమైన వక్కసాగు
అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీతో పామాయిల్కు మహర్దశ
దమ్మపేట రూరల్, మే 21 : అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు ఉద్యానవన పంటలకు నిలయంగా మారాయి. గతంలో ఈ ప్రాంతలో మామిడి, జీడిమామిడి సాగు చేసిన రైతులు వాతావరణ ప్రతికూలతతో కనీస ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై అన్వేషించారు. తొలుత కొంతమంది ఔత్సాహిక రైతులు పామాయిల్, కొబ్బరి పంటల సాగు ప్రారంభించారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ దుష్ప్రభావాలు తక్కువుగా ఉండడంతో రైతులు పామాయిల్ సాగుకు మొగ్గు చూపుతున్నారు.
అప్పారావుపేట కర్మాగారంతో పామాయిల్కు మహర్దశ..
ఉమ్మడి రాష్ట్రంలో పామాయిల్ కర్మాగారం కేవలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగిలో మాత్రమే ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఉండేది. 2005లో రెండో పామాయిల్ కర్మాగారంగా అశ్వారావుపేటలో ప్రారంభమైంది. దీంతో జిల్లాలో పామాయిల్ సాగు విస్తరణ పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం హయాంలోఅప్పారావుపేట కర్మాగారం ఏర్పాటు..
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ ఆయిల్ఫెడ్ ఏర్పడింది. టీఎస్ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో అప్పారావుపేట పామాయిల్ కర్మాగార నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు నిధులు అందజేశారు. మిగిలిన సుమారు రూ.60 కోట్ల నిధులను నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తుతో రాయితీపై రుణం ఇప్పించి ఏడాది కాలంలోనే అధునాతన సాంకేతికతతో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయించారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైన తరువాత గణనీయంగా ఆయిల్ రికవరీ పెరిగింది.
భారీగా పెరుగుతున్న గెలల ధర..
అప్పారావుపేట ఫ్యాక్టరీలో సాధిస్తున్న ఆయిల్ రికవరీతో దేశంలోనే అత్యధిక ధరను తెలంగాణ రైతులు అందుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామాయిల్ నిల్వలు నిండుకోవడంతో పామాయిల్ పండ్ల గెలల ధరలు ఏడాదిగా పెరుగుతూ వస్తోంది. ఈ ధరలతో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్రాంత రైతులు పామాయిల్ సాగుతో స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. సాగు నీరు అందుబాటులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్గర్ జిల్లాల నుంచి రైతులు క్షేత్ర స్థాయి అధ్యయనానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ఉద్యానవన పంటలను చూసి ముగ్ధులవుతున్నారు. పామాయిల్ సాగుతో పాటు ఉద్యానవన పంటలైన అరటి, జామ, పుచ్చ, కూరగాయలు పంటలు సైతం పండిస్తున్నారు.
మల్టీ లేయర్ విధానంలో అంతర పంటలు..
పామాయిల్, కొబ్బరి సాగు సాగు చేస్తున్న రైతులు ఇప్పటి వరకూ అంతర పంటగా కో-కో సాగు చేపట్టారు. కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో కొబ్బరిలో అంతర పంటగా వక్క, మిరియం సాగు చేస్తారు. ఈ విధానాన్ని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన రైతులు అంతర పంటగా వక్క, మిరియం సాగు ప్రారంభించారు. కొబ్బరితో పాటు అంతర పంటలైన కో-కో, వక్క, మిరియం పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మల్టీలేయర్ పంటల సాగుతో ఎకరాకు కనిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఆదాయం సాధించవచ్చని రైతులు అంటున్నారు