సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): వైరస్ నివారణకు మొక్కుబడిగా చర్యలు చేపట్టొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు మనిషి జీవన శైలిలో మాస్కు తప్పనిసరైంది. రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తే హెల్మెట్ తప్పనిసరి ఎలాగో.. ఇప్పుడు బయటకు వెళ్తే ముఖానికి మాస్కు కూడా అత్యవసరమైంది. గత సంవత్సరం కంటే సెకండ్ వేవ్ ప్రభావంతో మాస్కుల వినియోగం పెరిగింది. సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణ హోమం, భయంకర పరిస్థితుల నేపథ్యంలో జనం నూటికి 90 శాతం మంది మాస్కులను ధరిస్తున్నారు. అయితే, వీరిలో చాలా మంది మాస్కు ధరిస్తున్నామా? అన్నట్లు మొక్కుబడిగా నియమాలు పాటిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మొక్కుబడిగా మాస్కులు ధరించడం వల్ల ఫలితం ఉండబోదని, సరైన పద్ధతిలో మాస్కులు ధరించకపోతే వైరస్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే మాస్కుల శుభ్రతపై దృష్టి పెట్టకపోవడం; మాస్కులను శుభ్రం చేయకుండా ధరిస్తే.. పాజిటివ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్కు దారితీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్య నిపుణులు. చాలా మంది మాస్కులను శుభ్రం చేయకుండా ధరించడం, రెండు మూడు రోజులు ఉతకకుండా ఒకే మాస్కును ధరించడం, మాస్కును ఉతికి బయట దుమ్ము ధూళిలో ఆరేయడం వంటి తప్పిదాలతో ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.