సిటీబ్యూరో, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ ): పెండ్లి అంటే దంపతులు ఒకరికొకరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా వందేండ్లు ఉండే జీవితంగా భావిస్తారు. కాని ఎక్కువ మంది ఆ వివాహ బంధాన్ని కాపాడుకోలేక మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు. కారణాలు అనేకం ఉన్నాయి. కొందరిని అనుమానమనే రక్కసి ఆవహిస్తే.. మరికొందరి జీవితాలు అక్రమ సంబంధాలతో నాశనమవుతున్నాయి. అయితే వివాహం అనంతరం ఎదురయ్యే ఇలాంటి సమస్యలకు పెద్దలు, సైకాలజిస్టులు, పోలీసులు సర్దిచెప్పి దాంపత్య జీవితాన్ని నిలబెడుతున్నారు. కాని ఆరోగ్య సమస్యలు దాచి వివాహం చేశారనే విషయాల్లో మాత్రం విడాకులే శరణ్యం అవుతున్నాయని వైద్యులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాదు సంతానంపై కూడా దుష్పరిణామాలు చూపించే వీలు ఉండటంతో పెండ్లికి ముందే హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు వివాహానికి ముందు వధువు, వరుడు ఆరోగ్య పరీక్షల రిపోర్ట్ను తల్లిదండ్రులు అడుగుతున్నారు. అంతా ఓకే అనుకున్నాకే పెండ్లికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఏమాత్రం తేడా అనిపించినా వివాహం రద్దు చేసుకుంటున్నారు. ఈ విధానం దాంపత్య జీవితానికి శ్రేయస్కరమని అందరూ విశ్వసిస్తున్నారు. ఈ కల్చర్ నగరంలో పెరుగుతుంది. అందరూ విద్యావంతులు, ఉద్యోగులు ఉండటంతో తమ వివాహ అనంతరం జీవితం ఘర్షణలకు తావులేకుండా ఉండేందుకు ముందుగానే హెల్త్ రిపోర్ట్ను పరిశీలించుకుంటున్నారు.
ప్రశాంతి(పేరు మార్చాం)తల్లిదండ్రులు సాధారణంగా జరిగే పెండ్లి తంతు వలే వివాహం ముగించారు. ఎన్నో ఆశలతో మెట్టినింటికి వెళ్లిన ఆమెకు నివ్వెరెపోయే వాస్తవాలు తెలిశాయి. తొలిరాత్రి భర్త ఆమెకు దూరంగా ఉండటంతో బిడియం అనుకుంది. రెండో రోజు కూడా అలానే చేయడంతో కొంత అనుమానం వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. మూడో రోజు తనకు సెక్స్పట్ల ఆసక్తి లేదని చెప్పేశాడు. ఆరా తీస్తే అతడికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ వేసుకోకపోతే అతడు నడవలేని పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలపడంతో అమ్మాయి తాలుకా ఫ్యామిలీ షాక్కు గురైంది. భర్త, అత్తమామలపై పోలీస్లకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకుంది.
ప్రధానమైనది ఎస్టీడీ (సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్) టెస్ట్. భాగస్వామికి ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా తదితర వ్యాధులు ఉంటే బయటపడుతాయి. అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఫలితంగా సంతానం కూడా కలుగక బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హిమోగ్లోబిన్ ఎలక్ట్రో ఫోరోసిస్ టెస్ట్. ఈ టెస్ట్తో తలసీమియా, సికిల్ సెల్ డిసీస్ లాంటి అనువంశిక డిజార్డర్ తెలిసిపోతుంది. ఒకవేళ వధువు, వరుడు ఇద్దరు ఈ వ్యాధికి గురైతే సంతానానికి కూడా సోకుతుంది. అందుకే వివాహానికి ముందే టెస్ట్ చేయించుకుంటే భయంకరమైన రోగాల నుంచి బయటపడొచ్చు.
ఫెర్టిలిటీ టెస్ట్తో సంతాన సామర్థ్యం తెలిసిపోతుంది. జెనెటిక్ డిసీస్ చెకప్తో వంశపారంపర్య వ్యాధులు ఉంటే తెలుస్తుంది. వాటితో పాటు జనరల్ హెల్త్ చెకప్ కూడా అవసరమేనని వైద్యులు సూచిస్తున్నారు.
సీబీసీ (కంప్లీట్ బ్లడ్ సెల్ కౌంట్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, షుగర్) టెస్ట్ లాంటివి చేయిస్తే బయటపడే వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చు. దంపతులు ఆర్థిక విషయాలపైనే కాకుండా ఆరోగ్య విషయాలపై కూడా అవగాహనతో ఉంటే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని సూచిస్తున్నారు. ఆమె పేరు దీప్తి. ఐటీ ఉద్యోగి. మే నెలలో ఆమెకు పెండ్లి సంబంధం కుదిరింది. ఇద్దరూ ఒకరినొకరు నచ్చుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టుకునే ముందు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో అబ్బాయి హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. అందుకు అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో అనుమానం వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు వివాహం రద్దు చేసుకున్నారు.
వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలు అంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. తమను అవమానిస్తున్నట్టుగా భావిస్తుంటారు. అది మంచిది కాదు. ఆరోగ్య పరీక్షలు మన ఆరోగ్యం కోసమే అనే విషయం తెలుసుకోవాలి. పెండ్లికి ముందు వారి వ్యాధులను దాచిపెట్టడం మంచిది కాదు. వివాహ అనంతరం తెలియగానే వారిలో విద్వేశం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటాయి. దాని దుష్పరిణామం వారు జీవితాంతం భరించాల్సి వస్తుంది. – డాక్టర్ ప్రతిభాలక్ష్మి, ఉస్మానియా దవాఖాన
పెండ్లికి ముందు ఒకరినొకరూ అర్థం చేసుకోవడమంటే శారీరక, మానసిక, ఆర్థిక విషయాలను చర్చించుకుని అవగాహనకు రావడం. ఈరోజుల్లో తల్లిదండ్రులు కేవలం ఆర్థిక విషయాలకే పరిమితమవుతున్నారు. అది మంచి విధానం కాదు. ఇప్పుడు పెండ్లీల సీజన్ మొదలైంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా సంబంధాలు కుదుర్చుకోవాలి. పెండ్లికి ముందు హెల్త్ చెకప్ అవసరమనే విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ప్రస్తుతం ఆలస్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండటం కూడా కొన్ని ఇబ్బందులను కలిగించే విషయంగా భావించాలి. – అనిత గాలి, సోషల్ ఎంటర్ప్రెన్యూర్
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. అందుకే ఎంతో ఘనంగా జరుపుకోవాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కొంతమంది ఆ పెండ్లి తంతును 15 రోజుల ఉత్సవాలుగా ప్రణాళికలు చేసుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో థీమ్తో బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వేద మంత్రాల మధ్య ఒక్కటైన ఆ బంధం కొద్ది రోజులకే విడిపోతే ఆ ప్రభావం వారి మీదనే కాదు కుటుంబ సభ్యులపై కూడా పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను దాచి వివాహం చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే పెద్దలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనే సంకేతాన్ని ఇచ్చారని ప్రస్తుత పెద్దలు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలను దాచి వివాహం చేస్తే దంపతులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని సామాజిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వివాహానికి ముందు అమ్మాయి, అబ్బాయి హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. వారికి తెలియని వ్యాధులు కూడా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అవగాహనతో వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని సూచిస్తున్నారు.