మ్యాట్రిమోనీ సైట్లో అమెరికా గ్రీన్కార్డు హోల్డర్గా పరిచయం అయిన ఓ నైజీరియన్ సైబర్చీటర్.. నగరానికి చెందిన ఓ యువతిని పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి… రూ. 10 లక్షలు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెండ్లి సంబంధాల కోసం భారత్మ్యాట్రిమోనీ తెలుగు సంబంధాల విభాగంలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్ను చూసిన మునగర్ మొహల్కుమార్ అనే పేరుతో సైబర్ నేరగాడు.. పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చాడు. తనది భారత్ అని, గుజరాత్లో తనకు సొంత ఇల్లు ఉన్నదని.. ప్రస్తుతం నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. ఇలా కొన్నాళ్లు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు.
ఈ క్ర మంలో గుజరాత్లో ఉన్న ఇంటి మరమ్మతుల కోసం మేస్త్రికి కొన్ని డబ్బులు అవసరమున్నాయని, అతడి ఖాతా లో జమ చేస్తే త్వరలో నేను భారత్కు వచ్చినప్పుడు.. మీకు ఇస్తాను అని నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆమె.. అత డు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించింది. పెండ్లి చేసుకున్న తరువాత నిన్ను అమెరికాకు తీసుకెళ్లా ను..అందుకు సంబంధించి ఇప్పటి నుంచే వీసా ప్రాసెసింగ్ మొదలు పెడితే బాగుంటుందని ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు.. ఆ నంబర్కు ఫోన్ చేయగా వీసా ప్రాసెసింగ్ చేస్తామని, కొంత డబ్బు చెల్లించాలంటూ చెప్పగా.. ఆడబ్బు డిపాజిట్ చేసింది.. ఇలా అప్పటికే రూ. 4 లక్షలు ఆమె సైబర్నేరగాడు చెప్పినట్లు ఆయా ఖాతాల్లో డిపాజిట్ చేసింది.
కాగా.. వారం రోజుల తరువాత ఇండియాకు వస్తున్నానని, నేరుగా హైదరాబాద్కు వస్తున్నానంటూ అతను న మ్మించాడు. వారం తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఆమెకు ఫోన్చేశాడు. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన వద్ద 50వేల డాలర్లు ఉన్నాయని, అందుకు జరిమానా చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ చెప్పాడు.. అలా కస్టమ్స్ అధికారుల పేరుతో రూ. 6 లక్షలు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ మేరకు ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది.