బంజారాహిల్స్,మే 18: ప్రేమించి పెండ్లి చేసుకొని తగాదాలొచ్చి విడిపోయి మళ్లీ కలుసుకున్న ఓ జంట ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. భర్త చేతిలో మోసపోయానని భార్య, తానే భార్య చేతిలో వంచనకు గురయ్యానని భర్త ఆరోపణలు గుప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్లో నివాసముంటున్న ఎం.సంధ్యారాణి(28) పోలీస్ శాఖలోని ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. ఆమె భర్త చనిపోగా ఏడేండ్ల కూతురుతో కలిసి నివాసముంటున్నది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన పూసల చరణ్తేజ(24) డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి రహ్మత్నగర్లో ఉంటున్నాడు. వీరిద్దరికి రెండేండ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది నవంబర్ 7న కూకట్పల్లి ఆర్యసమాజ్లో పెండ్లి చేసుకున్నారు. పెండ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది జనవరిలో వీళ్లిద్దరి పంచాయితీ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లింది. అక్కడ ఇద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు.
ఈ సందర్భంగా.. సంధ్యారాణికి గతంలో పైండ్లె కూతురు ఉన్న విషయం కూడా తెలుసని, అన్నీ తెలిసే పెండ్లి చేసుకున్నానంటూ బాండ్ పేపర్పై ఒక ఒప్పంద ప త్రం రాయించారు. ఆ తరువాత కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి ఉన్నారు. కాగా నాలుగురోజుల కిందట తల్లిదండ్రులతో మాట్లాడివస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన చరణ్, తిరిగి రాకపోవడంతో సంధ్య ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఎస్సీ కులానికి చెందినందునే చరణ్తేజ కుటుంబ సభ్యులు పెండ్లిని ఆమోదించడం లేద ని, అందుకే చరణ్తేజ తనను మోసం చేసేందుకు ప్ర యత్నిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం చరణ్తేజను పోలీస్స్టేషన్కు పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు.
తనను మోసం చేసి సంధ్య పెళ్లి చేసుకున్నదని, సంధ్యకు గతంలో కూడా పలువురితో సంబంధాలు ఉన్నాయంటూ చరణ్తేజ ఈ సందర్భంగా ఆరోపించాడు. తనను బ్లాక్ మెయిల్ చేసి పెండ్లి చేసుకున్న లేడీ కానిస్టేబుల్ సంధ్యారాణికి గతంలో ముగ్గురితో పెండ్లి అయ్యిందని, బ్లాక్మెయిల్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం ఆమెకు అలవాటంటూ చరణ్తేజ కొన్ని సెల్ఫీవీడియోలు సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. తనను ట్రాప్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించి పెండ్లి చేసుకుందంటూ వీడియోలో పేర్కొన్నాడు. గతంలో ఆమెకు పెండ్లి జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి తనను గత నవంబర్లో వివాహం చేసుకుందని ఆరోపించాడు. ఆమె ఎస్సీ కాదని, మరో మతంలోకి మారాలంటూ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నదంటూ ఆరోపించాడు.
చరణ్ ఈ వ్యవహారంపై మూడు రోజుల కిందటే ఆన్లైన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు, వెస్ట్జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశాడు. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న చరణ్ ఆ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.