: పెండ్లి అంటే పెద్ద వేడుక..అదొక సంబురం..రెండిండ్లల్లో ఒకటే హడావుడి. పెండ్లిచూపులు మొదలు వివాహం పూర్తయ్యే వరకు బంధుమిత్రులతో సరదాగా సాగే తంతు. కరోనా అన్ని రంగాలు మాదిరి వివాహ క్రతువును పూర్తిగా మార్చేసింది. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో కేవలం 50 మందితో వివాహం పూర్తి చేసుకోవాలని సూచించడంతో బంధుగణంతో కళకళలాడాల్సి వేడుక వెలవెలబోతున్నది. అయితే సాంకేతికయుగం కావడంతో పెండ్లి వేడుకను లింక్ ద్వారా ఇంట్లో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.
అధికమంది హాజరయ్యే అవకాశం లేకపోవడంతో నిర్వాహకులు ప్రత్యక్షంగా పెండ్లి వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే బంధువులందరికీ సామాజిక మాధ్యమం ద్వారా తమ వేడుకలను ఆహ్వానపత్రికలను పంచుకుంటున్నారు. పెండ్లికి వారంరోజుల ముందు నుంచే వేడుకలను ఇంటి వద్దనే ఉండి తిలకించేందుకు
‘లైవ్’లింక్లను క్రియేట్ చేస్తూ బంధువులు, సన్నిహితులకు పంపించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇండ్ల వద్దే ఉంటూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రత్యక్షంగా 50 మందే హాజరవుతున్నా…లైవ్ ద్వారా వందలాదిమంది తిలకించడం కొంతలో కొంత ఊరటనిస్తున్నదని కాబోయే జంటలు పేర్కొంటున్నాయి. వివాహ వేడుకలలో ఈవెంట్లు నిర్వహించే వారు ఈ తరహా కొత్త సేవలను అందుబాటులోకి తెస్తూ నిర్వాహకులలో సంతృప్తి నింపుతున్నారు.
ఎక్కువమంది గుమిగూడితే కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో పరిమిత సంఖ్యలో ఉండాలని సూచిస్తున్నాం. వేడుకకు 50 మందికి మించితే వివాహం జరిపించేది లేదని తెగేసి చెబుతున్నాం. అలా అంగీకరిస్తున్న వివాహాలకు మాత్రమే వెళుతున్నాం. వేదికపై నూతన జంట, బ్రాహ్మణుడు, వీడియో లేదా ఫొటోగ్రాఫర్ను ఉండేలా షరతు విధిస్తున్నాం.-పురాణం దిశేష్శర్మ, పురోహితుడు
ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విపత్కర పరిస్థితి. బయటకెళ్లాలంటే భయపడే దుర్భర సమయం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో బంధువులు, స్నేహితుల ఆరోగ్యం మేలు కోరి కొంతమంది సమక్షంలో వివాహం చేసుకుంటున్నాం. రాని వారి కోసం ‘ లైవ్’ లింక్లను అందరికీ షేర్ చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ పిలువలేకపోతున్నందుకు బాధగా ఉన్నా తప్పడం లేదు. -నిత్య, పెండ్లికూతురు
కరోనా కల్లోల తరుణంలో అందరం జాగ్రత్తగా ఉందాం. పరిమిత సంఖ్య నడుమే వివాహ వేడుకను నిర్వహిస్తున్నాం. శ్రేయోభిలాషులు, ఆప్తులు ఇండ్ల వద్దే ఉండి పెండ్లి వేడుకను లైవ్ ద్వారా వీక్షించాలని కోరుతున్నాం. పెండ్లికి హాజరయ్యే పరిమిత బంధువులు మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవటం, సామాజికదూరం పాటించాలనే నిబంధనలను ముందే తెలియజేశాం. -సూరజ్, పెండ్లి కొడుకు