కంటోన్మెంట్, జూలై 25: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్రావును పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షు డు జక్కుల మహేశ్వర్ రెడ్డి బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం మర్యాద పూర్వకంగా నామాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం, ఆయనను మర్రి రాజశేఖర్రెడ్డి బృందం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్కు చెందిన భూముల బదలాయింపు, క్లార్ 2021 అభ్యంతరాల గురించి పార్లమెంట్లో చర్చించాలని పేర్కొన్నారు.
దీనికి సానుకూలంగా స్పందించిన నామా నాగేశ్వర్రావు పార్లమెంట్లో కంటోన్మెంట్ పరిస్థితులను ప్రస్తావనకు తీసుకొస్తానని, అదే విధంగా అవసరమైతే ప్రత్యేకంగా డిఫెన్స్ మంత్రితో సహా కేంద్ర మం త్రులను కలిసి బోర్డు పరిధిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం, మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్లోని మిలటరీ రోడ్లు మూసివేతతో ప్రజ లు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్రం కంటోన్మెంట్కు సహకరించకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బోర్డుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి తోడ్పాటునందిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు సమస్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్తో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డితో సహా బోర్డు మాజీ సభ్యులు భేటి అయ్యారు. బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, నళినీ కిరణ్, లోక్నాథం, ప్రభాకర్ పాల్గొన్నారు.