ఎల్బీనగర్, సెప్టెంబర్ 22: రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాను చైతన్యపురి పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండల్ కొవడ గ్రామానికి చెందిన కుంచినిపల్లి వీరబాబు( 28), విశాఖపట్నం జిల్లా మాకవానిపాలెం గ్రామానికి చెందిన రత్తుల శ్రీనివాస్రావు (38) జల్సాల కోసం, విలాసంతమైన జీవితాన్ని గడిపేందుకు గంజాయి సరఫరా చేసే కిట్టు అలియాస్ శ్రీనివాస్ను కలిశారు.
తాము హైదరాబాద్లో ఎక్కువ ధరకు గంజాయిని సరఫరా చేస్తామంటూ.. ఒప్పందానికి వచ్చారు. ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 22న కిట్టు సుమారు 23.140 కిలోల గంజాయిని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలించాలని, అందుకు రూ. 20 వేలు నుంచి రూ. 30 వేలు ఇస్తానంటూ.. వీరబాబు, శ్రీనివాస్రావులకు చెప్పాడు. ఈ క్రమంలో రాజమండ్రికి వెళ్లిన ఇద్దరు అక్కడ గంజాయిని 9 ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన కార్ డ్రైవర్ బొమ్మగల్ల సురేశ్ (24)ను సంప్రదించారు.
తామతో పాటు హైదరాబాద్కు గంజాయిని తరలించాలని కోరగా, అందుకు అంగీకరించిన సురేశ్.. ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. వారి మధ్య ఒప్పందం జరిగిన అనంతరం వాహనంలో గంజాయిని తీసుకుని నగరానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు కొత్తపేట బీజేఆర్ భవన్ సమీపంలోని టెలీఫోన్ కాలనీ వద్ద వీరి వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సురేశ్తో పాటు వీరబాబు, శ్రీనివాస్రావులను అరెస్టు చేసి..వాహనాన్ని, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రధాన సూత్రదారి కిట్టు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో చైతన్యపురి సీఐ రవికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణ నేతృత్వంలో ఎస్ఐ నాగేశ్వర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.