వెంగళరావునగర్, ఆగస్టు 23 : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమ గోదావి జిల్లా పాలకొల్లు మండలం, కోమచిక్కల గ్రామానికి చెందిన శివకోడు రాజేష్(52)బీకేగూడలోని జయభారతి పాఠశాల సమీపంలో ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నాడు.
మద్యానికి అలవాటున్న రాజేష్ తరచూ ఇంట్లోని కుటంబ సభ్యులతో ఘర్షణ పడేవాడు. ఆదివారం మధ్యాహ్నం రాజేష్ మద్యం మత్తులో కుటంబ సభ్యులతో గొడవపడ్డాడు.
దీంతో ఆయన భార్య, కూతురు, కుమారుడు నారాయణగూడలోని దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో రాజేష్ కూతురు శివకోడు శివలక్ష్మి తన తండ్రి ఇంట్లో ఉన్నాడా, లేదా అనే విషయాన్ని పక్కింట్లో ఉంటున్న సత్యవతి అనే మహిళకు ఫొన్ చేసి వాకబు చేసింది.
కాగా, వాళ్ల ఇంట్లో నుంచి టీవి శబ్ధాలు వస్తున్నాయని, రాజేష్ ఇంట్లోనే ఉండి ఉండవచ్చని చెప్పింది. సోమవారం ఉదయం 11.40 గంటలకు పక్కింటి సత్యవతి రాజేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించి అదే విషయాన్ని కూతురు శివలక్ష్మికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఇంటికి చేరుకున్న రాజేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.