హైదరాబాద్: ‘నా భూమిని సర్పంచ్ గుంజుకున్నాడు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇది ఎక్కడో జరగలేదు. రాజధాని హైదరాబాద్లోని వనస్థలిపురంలో. తారామతి పేటకు చెందిన కృష్ణ గౌడ్.. తన భూమిని గ్రామ సర్పంచ్ మూల మహేశ్ గౌడ్ లాక్కున్నాడని ఆరోపించారు. తనతో సంబంధం లేకుండానే ఇతరులకు అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తన సమస్యను పరిష్కరించలేదని వనస్థలిపురంలోని చింతలకుంటలో ఉన్న రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ గౌడ్ను రేడియో టవర్పై నుంచి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.