కేపీహెచ్బీ కాలనీ, జూన్ 18 : మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మలేరియా నియంత్రణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో డీసీలు, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి మలేరియా నియంత్రణ మాసోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించడంతో పాటు ఎంటమాలజీ సిబ్బందికి బ్యాటరీ స్ప్రేయర్, మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వానకాలంలో నీటి నిల్వలు పెరుగుతుండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధిచెందే అవకాశాలున్నాయని తద్వారా మలేరియా, డెంగీ లాంటి సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశముందన్నారు.
దీని నియంత్రణ కోసం జూన్ 1 నుంచి 30 వరకు మలేరియా నియంత్రణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమలను లార్వా దశలోనే అంతం చేసేలా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఆదివారం డ్రై డేగా పాటించి ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చెరువులు, కుంటల లో రసాయనాలను పిచికారీ చేయడంతో పాటు గంబూ సియా చేపలను వదిలి దోమల వ్యాప్తిని నియంత్రిం చనున్నట్లు తెలిపారు. మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా ఎంటమాలజీ సిబ్బంది పనిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు కె.రవికుమార్, వి.ప్రశాంతి, సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి, ఐదు సర్కిళ్లకు చెందిన ఎంటమాలజీ అసిస్టెంట్లు,పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 18 : కాలనీలు, బస్తీలలో దెబ్బతిన్న మ్యాన్హోళ్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో టీఆర్ఎంపీ ఏజెన్సీ (మెగా ఇంజినీరింగ్), జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులతో వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన పనులపై జడ్సీ మమత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వానకాలం ముగిసే వరకు రోడ్డు తవ్వకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్నటువంటి మ్యాన్హోళ్లను వెంటనే బాగుచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు గుంతలను త్వరగా పూడ్చాలని.. ఇప్పటికే చేపట్టిన మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రానున్న హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.