కేపీహెచ్బీ కాలనీ, జూన్ 9 : కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. కరోనా సెకండ్ వేవ్తో అప్రమత్తమైన యంత్రాంగం కరోనా కట్టడికి బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఓవైపు కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సను ప్రారంభించడం.. మరోవైపు బస్తీ దవాఖాన ఆరోగ్య కేంద్రాలతో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించిన వారికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించడం చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి అర్హులందరికీ టీకాలు వేస్తున్నారు. కాలనీలు, బస్తీలలో సోడి యం హైపోక్లోరైట్ ద్రావ ణం పిచికారీతో పాటు పకడ్బందీగా లాక్డౌన్ అమ లు చేస్తుండడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
కరోనా లక్షణాలను ప్రాథమికంగా గుర్తించేందుకు చేపట్టిన జ్వర సర్వే నిర్విరామంగా కొనసాగుతున్నది. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 242 బృందాలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న వారిని గుర్తిస్తూ మెడికల్ కిట్లను అందిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దశలలో కలిపి 8.39 లక్షల ఇండ్లలో సర్వే చేయగా 6,796 మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. మొదటి దశలో 4,13,535 ఇండ్లలో జ్వర సర్వే చేసి 5,056 మెడికల్ కిట్లను పంపిణీ చేయగా రెండో దశలో 4,25,317 ఇండ్లలో సర్వే చేసి 1740 మందికి మెడికల్ కిట్లను అందించారు.
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా సూపర్ స్ప్రెడర్లు (నిత్య సేవకులకు) కరోరా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. జోన్లోని ఐదు సర్కిళ్లలో పది రోజులుగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 59,494 మందికి టీకాలు వేశారు.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో ఇంటింటికీ జ్వర సర్వేతో లక్షణాలున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేశాం. ప్రభుత్వం సూచించిన విధంగా సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరోవైపు కాలనీలు, బస్తీలలో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయిస్తున్నాం. లాక్డౌన్ అమలవుతుండడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. – వి. మమత, జడ్సీ కూకట్పల్లి