కేపీహెచ్బీ కాలనీ, మే 30: పకడ్బందీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. ఆదివారం మూసాపేట సర్కిల్లోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను జడ్సీ మమత, డీసీ రవికుమార్, బాలాజీనగర్ కార్పొరేటర్ పగడాల శిరీషాబాబూరావు పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా లాక్డౌన్ విధించడంతో పాటు కరోనాను తొలిదశలోనే గుర్తించడం కోసం జ్వర సర్వేను నిర్వహించి మెడికల్ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో ఓపీ సేవలను నిర్వహించడంతో పాటు ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. హోం ఐసొలేషన్ సౌకర్యం లేనివారి కోసం ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందకుండా నిత్య సేవకులైన (సూపర్ స్ప్రెడర్లు) కిరాణం, పూలు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, మద్యం దుకాణాలు, చికెన్, చేపల మార్కెట్లలో పనిచేసే సిబ్బందికి మొదటి విడుతగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. దీనిలో ఎలాంటి అవకతవకలు లేకుండా టీకాలు వేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జోన్లోని ఐదు సర్కిళ్లలో గుర్తించిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంహెచ్వో సంపత్కుమార్, డీపీవో శ్రీనివాస్, ఎస్ఎస్ మురళీధర్రెడ్డి తదితరులు ఉన్నారు.
కూకట్పల్లి జోన్లోని ఐదు సర్కిళ్లలో 3,427 మంది సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకాలు వేసినట్లు జడ్సీ మమత తెలిపారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల 2618 మందికి, 44 సంవత్సరాలు పైబడిన 209 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 1138 మంది, కూకట్పల్లి సర్కిల్లో 700, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 466, గాజులరామారం సర్కిల్లో 578, అల్వాల్ సర్కిల్లో 905 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు.