కేపీహెచ్బీ కాలనీ, జూన్ 23 : జీహెచ్ఎంసీ నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో డెమోలిషన్ స్కాడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ వాహనాలను జడ్సీ మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్బీపాస్ను వచ్చే నెలనుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. డీపీఎంఎస్ విధానానికి స్వస్తి పలికి టీఎస్బీపాస్తోనే భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి భవనాలు నిర్మిస్తే ఎలాంటి నోటీసులు లేకుండా ఆ భవనాలను కూల్చివేస్తామని చెప్పారు. దీనికోసం జోన్కు రెండు చొప్పున డెమోలిషన్ స్కాడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు జడ్సీ మమత తెలిపారు. కూకట్పల్లి జోన్లో కేటాయించిన రెండు ఎయిర్ బోట్స్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అత్యవసర బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వరద ముంపు సమస్యలు ఏర్పడితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు ఎయిర్ బోట్స్ ఉపయోగపడతాయన్నారు. ముంపు సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, టీటీసీవో శ్రీరాములు, డీఈ ఆనంద్, ఏఈ రంజిత్ ఉన్నారు.