సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ), ఉప్పల్: లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని.. అనుమతి లేకుండా బయటికి వచ్చేవారిపై చర్యలు తప్పవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. బుధవారం ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఆయన తనిఖీ చేశారు. వాహనదారులను ఆపి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని కోరారు. లాక్డౌన్లో తయారీ, నిర్మాణ రంగాలు, ఐటీ, ఫార్మా రంగాలు రెండు షిఫ్టుల సమయ పాలన పాటిస్తున్నాయని తెలిపారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్లు సజావుగా వెళ్లేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్, వాటర్బాటిళ్లు పంపిణీ చేశారు.
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఓ గర్భిణిని ఇంటికి చేర్చి.. మానవత్వాన్ని చాటుకున్నారు నాంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. నాంపల్లి ఏరియా దవాఖాన నుంచి గర్భిణి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేశ్యాదవ్ ఆమెను ఆపి విషయం తెలుసుకున్నారు. వాహనాలు లేకపోవడంతో నడుచుకుంటూ.. మెహిదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో చలించిపోయారు. వెంటనే తన కారులో ఆమెను తన ఇంటి వద్ద దించిరావాలంటూ.. డ్రైవర్కు సూచించారు. ఇంటికి చేరుకున్న ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది.