రాచకొండ పోలీసులు ‘మత్తు’పై సమరభేరి మోగించారు. వాటిని విక్రయించే ముఠాలతో పాటు సరఫరా చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే వందలాది మందిని అరెస్టు చేయగా, ఆ కేసులు వీగిపోకుండా సమర్థవంతంగా శిక్షలు పడేలా పకడ్బందీగా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి చివరి వరకు ప్రతి అంశంలో పూర్తి ఆధారాలను సేకరించడంతో పాటు వాటిని రుజువు చేసేందుకు నిర్వహించాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
‘మత్తు’ కేసుల్లో అరెస్టయిన నిందితులు తప్పించుకోకుండా పోలీసులు దర్యాప్తు, విచారణను సమర్థవంతంగా నిర్వహించేలా నిపుణులతో అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపి నేరస్తులకు వేగంగా శిక్షలు పడే విధంగా చర్యలను తీసుకునేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు.
ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయి, తదితర మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలకు సంబంధించిన కేసుల పురోగతిని సమీక్షిస్తున్నారు. వాటి తాజా విచారణ స్థితిని పరిశీలిస్తున్నారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా దర్యాప్తు అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 7500 కేజీల గంజాయితో పాటు సుమారు 400 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఎక్కడైనా…ఎవరైనా…మత్తు దందా చేస్తే వారి సమాచారాన్ని డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్ 9490617 111కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మత్తు దందా చేసే వారిపై కమిషనరేట్ పరిధిలో 64 మందిపై పీడీయాక్ట్ విధించాం. నిల్వ ఉంచిన ఓ ఇంటిని కూడా 133 సీఆర్పీసీ కింద సీజ్ చేశాం. కళాశాలలు, కాలేజీల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేశాం. విద్యార్థులు, యువత మత్తు జోలికి పోకుండా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. -మహేశ్ భగవత్, పోలీస్ కమిషనర్, రాచకొండ