సుల్తాన్బజార్, నవంబర్ 8: శరీరాన్ని ముప్పు తిప్పలు పెట్టే రుగ్మతలు దీర్ఘకాలికమైనవైతే..ఇక ఆ రోగి బతికున్నంత కాలం డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. మధ్య తరగతి కుటుంబీకులు, పేద వాైళ్లెతే కొన్ని సార్లు ఈ ఖర్చులు భరించలేక ఆ చికిత్సను విరమించుకొని మృత్యు ముఖానికి చేరువవుతుంటారు. అలాంటి వారికి అత్యంత తక్కువ ఖర్చులో ఖరీదైన సేవలందిస్తున్నది భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్టు. మూత్ర పిండాలు పనిచేయని వారికి అవసరమయ్యే డయాలసిస్ సేవలను కేవలం 300 రూపాయలకే అందిస్తూ ఆపన్నులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది.
ఈ సేవలందించేందుకు నగరంలోని కార్పొరేటు దవాఖానల్లో రూ.1200 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తుంటే… మహావీర్ ట్రస్టు మాత్రం ఆపన్నులకు చవకైన ధరలోనే డయాలసిస్ చేస్తున్నది. పన్నెండేండ్ల క్రితం ఓ చిన్న సంస్థగా ప్రయాణాన్ని ప్రారంభించి నేడు అతి పెద్ద మానవతా సేవా సంస్థగా విశేష ఆదరణ పొందింది. రోజుకు సగటున 300 మందికి పైగా రోగులకు రక్తశుద్ధి చేస్తూ ఇప్పటివరకు 10 లక్షల మందికి ఉపశమనాన్ని కల్పించింది. ఆలేరులోని జైన్ మందిర్ వద్ద ఉన్న కేంద్రంతో పాటు నగరంలోని 7 కేంద్రాల్లో ఈ సేవలు లభ్యమవుతున్నాయి.
గత నెల 14నే సేవల సంఖ్య పది లక్షల మార్కుకు చేరుకోగా ఈ వివరాలను భగవాన్ మహావీర్ ట్రస్ట్ చైర్మన్ పీసీ పారక్ సోమవారం కింగ్కోఠి జిల్లా దవాఖానలో విలేకరులకు తెలిపారు. ఇప్పటి వరకు 10 లక్షల డయాలసిస్లు చేసి వరల్డ్ రికార్డ్ పొందామని వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు పేదలకు ఆర్థిక భారాన్ని తప్పిస్తున్నాయని చెప్పారు. కింగ్కోఠి ప్రధాన కార్యాలయంగా ట్రస్ట్ను నడుపుతున్నామని.. మాసబ్ట్యాంక్లోని మహావీర్ దవాఖానలో 61 డయాలసిస్ యంత్రాలతో సేవలందిస్తున్నామ న్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈ నెల 13న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గౌతమ్ చంద్ చోర్డియా, సతీశ్ ఖివ్సార, ఇందర్ చంద్జైన్, రాకాబ్ పారక్, రాజేందర్ కుమార్ దుగూర్, స్వరూప్చంద్ కొఠారీ, అశోక్ కొఠారీ, సునీల్ పహాడే, సురేశ్ సురానా, వినోద్, శాంతిభాయ్ షా, ప్రశాంత్ శ్రీమల్, హనుమాన్ మల్కుమార్ పట్నీ, సుశీల్ కపాడియాలు పాల్గొన్నారు.