ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
జీహెచ్ఎంసీ తరహాలో పాలమూరులో బస్తీ దవాఖానలు
వీరన్నపేట, టీడీగుట్ట, పాతపాలమూరు, ఏనుగొండలో ప్రారంభం
నిరంతరం పనిచేసేలా ఆదేశాలు
హన్వాడలో ధాన్యం కేంద్రాల పరిశీలన
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 24 : బస్తీల్లో పేదలు జ్వరం వస్తే డాక్టర్ల వద్దకు పోలేని పరిస్థితి మా దృష్టికి రావడంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ఆదర్శంగా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పాలమూరులో పేదల కోసం నాలుగు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ, పాతపాలమూరు దోబీవా డ, వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను సోమవారం ప్రారంభించారు. ఒక డాక్టర్, మహిళా డాక్టర్తోపాటు జనరల్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారని, డయగ్నోస్టిక్ టెస్టులతో పాటు చిన్న చిన్న చికిత్సలు చేస్తారని, అవసరమైతే ప్రభుత్వ జనరల్ దవాఖానకు రెఫర్ చేస్తారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా బస్తీ దవాఖానలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. దవాఖానలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. రోగులతోపా టు, ప్రత్యేకించి డాక్టర్లకు వేర్వేరుగా మూత్రశాలలు ఏర్పా టు చేయాలని, దవాఖాన వాతావరణం శుభ్రంగా ఉండే లా చూడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సిములు, వైస్చైర్మన్ గణేశ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు వనజ, రామాంజనేయులు, జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
హన్వాడ, మే 24 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని వేపూర్, హన్వాడ గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే గో దాములకు తరలించాలని తెలిపారు. మంత్రివెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉన్నారు.