నగర శివారు నుంచి ఓ యువకుడు ఉదయం 10.45 గంటలకు బైక్పై సిటీకి వస్తున్నాడు.. చెక్పాయింట్ వద్ద పోలీసులు అతన్ని ఆపారు.. సార్.. మా ఇంట్లోవారికి అర్జంట్గా మందులు అవసరం ఉన్నాయి.. మా వద్ద దొరకడంలేదు.. అందుకే సిటీకి వెళ్తున్నానన్నాడు. ఇందుకు ఓ మందుల చిటీని చూపించాడు.. నిజంగానే అనుకున్న పోలీసులు అతన్ని వదిలేశారు.. దీంతో అతను పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి ఇంటికి వెళ్లాడు.. స్నేహితులతో పోలీసులకు మాటలు చెప్పి తిరిగి వచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నాడు.. ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్నది.
అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి నిరంతరం రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే .. కొందరు చేసే తప్పిదాలు.. మిగతా వారికి శాపంగా మారే అవకాశం ఉంది. ఒక వైపు పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు కొందరు వైరస్ను మరింత వ్యాప్తిచేసేలా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు.. ప్రభుత్వం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎంత మొత్తుకుంటున్నా.. చాలా మంది మాకేమి కాదు… మేం ధృడంగా ఉన్నాం అనే భావనతో తప్పులు చేస్తూ.. ఇతరులకు వైరస్ను వ్యాపింపచేస్తున్నారు..
చాలామంది మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న తప్పులు అనర్థాలకు దారి తీస్తుందని అర్థం చేసుకోవడం లేదు. పోలీసులను, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికే నష్టం అని ఆలోచించాలి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది చెప్పే సాకులు బాధ కలిగిస్తున్నదని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయినా పోలీసులు చట్టపరంగా తమ విధుల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 20వేలకు పైగా చలాన్లు జారీ చేశారు. కాబట్టి సాకులు వద్దు, బాధ్యతగా వ్యవహరిద్దాం. మహమ్మారిని బంధించేందుకు బాధ్యతయుతంగా వ్యవహరిద్దామని ప్రతి ఒక్కరూ.. వారికి వారు ఆత్మ ప్రమాణం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. కొద్ది మంది నిర్లక్ష్యం కారణంగా అందరికీ శాపంగా మారొద్దని కోరుతున్నారు.
సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా చైన్ లింక్ను తెగొట్టాలంటే లాక్డౌన్ తప్పని సరి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుతున్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతించాలని ఆయా పోలీస్ చెక్పోస్టుల ఇన్చార్జిలకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల రవాణాకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే 9490616012కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు సోషల్మీడియా ద్వారా అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.