సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): మీరు ఇంట్లోనే ఉండండి.. మీకు రక్షణగా మేం రోడ్లపై విధులు నిర్వహిస్తున్నాం.. అని లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి రాచకొండ సీపీ మహేశ్భగవత్, పోలీస్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రభుత్వం, పోలీసులు ప్రజలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. పౌరులు మాత్రం వారికి పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రోడ్లపై తిరుగుతూ.. పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన పోలీసులు రోడ్లపైకి వచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుండటంతో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.102 ప్రకారం రాచకొండ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 38,595 కేసులు నమోదు చేసి ఈ-చలాన్ జారీ చేయగా.. 7,252 వాహనాలను సీజ్ చేశారు. అయితే విపత్తు నివారణ చట్టంతో పాటు, ఐపీసీ సెక్షన్లను జోడించి కేసులు నమోదు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో భద్రపరుస్తున్న పోలీసులు.. వాటన్నింటిని లాక్డౌన్ తర్వాతనే విడుదల చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
నగరంలో లాక్డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం స్వయంగా పరిశీలించారు. సీపీలు అంజనీ కుమార్, సజ్జనార్తో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కల్గించవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.