కరోనా వైరస్ ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు. వైరస్ను అంతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామంటామని వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే ముఖ్యంగా నిత్యావసర దుకాణాలు, వైన్స్ షాపులు రద్దీగా మారాయి. షాపుల ముందు స్థానికులు క్యూ కట్టారు. మరోవైపు ఉద్యోగులు, ఇతర రాష్ర్టాల కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. కొందరు సొంత వాహనాలు, మరికొందరు బస్సుల్లో బయలు దేరడంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడాయి.
కరోనా విజృంభణను అరికట్టేందుకు సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలాలి. ఈ దిశగా ప్రతిఒక్కరి చర్యలుండాలి. – జి.సత్యనారాయణ, గాంధీనగర్
పేదలు, రోజువారీ కూలీలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లాక్డౌన్ గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ బాగా ఆలోచించి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్బంధం ప్రకటించింది. నిత్యావసరాలకు తగిన సమయం ఇవ్వడం మంచి పరిణామం. ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి. కరోనా కట్టడికి ప్రతిఒక్కరి సహకారం తప్పనిసరి. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ
లాక్డౌన్ విధింపుతో కరోనాను కట్టడి చేయవచ్చు. ప్రభుత్వం మన క్షేమం కోరే ఈ నిర్ణయం తీసుకుంది. అందరూ లాక్డౌన్కు సహకరించాలి. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలి. -శ్యాం మోహన్ శర్శ, మాజీ డిప్యూటీ తహసీల్దార్
సెకండ్ వేవ్లో పెరిగిన కరోనా ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది. మన ప్రాణాలు రక్షించేందుకే సీఎం కేసీఆర్ ఈ చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి ఆగాలంటే మనమందరం ఇంట్లోనే ఉండాలి. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. -నరేశ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి
కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలి. మహమ్మారి విజృంభించకుండా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. చిట్టచివరికి లాక్డౌన్ అస్త్రం ప్రయోగించింది. ప్రభుత్వ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటిస్తూ కరోనాను తరిమేసేందుకు కలిసిరావాలి. – బెల్లపుకొండ వెంకటేశ్, కుత్బుల్లాపూర్
రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టి సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్కు మించిన ఆయుధం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే మన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంట్లోనే ఉందాం. – భాను మహర్షి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎన్ఎఫ్సీ నగర్
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం సమంజసమే. నియంత్రణ లేకపోవడంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ విధిగా పాటించాలి. లాక్డౌన్ సమయంలో ఇండ్లల్లోనే ఉండాలి. – కరుణాకర్రావు, సాలార్జంగ్ మ్యూజియం మాజీ అధికారి
ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పది రోజుల్లో కరోనాను పారద్రోలుదాం. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ చేయడం మంచి నిర్ణయమే. లాక్డౌన్ను అందరూ సక్సెస్ చేస్తే పది రోజుల్లో కరోనా పారిపోక తప్పదు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. – శరణ్జీత్ సింగ్, జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు)
కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. కొందరు కొవిడ్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. లాక్డౌన్తో మహమ్మారి కట్టడి అవుతుందన్న నమ్మకం ఉంది. వైరస్ లింక్ తెగడం ఖాయం. లాక్డౌన్కు ప్రతిఒక్కరూ సహకరించాలి. – బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
కరోనా రెండో దశలో విజృంభిస్తున్నది. ఇదే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది. ఈ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. ప్రభుత్వం ప్రకటించిన నిర్బంధ చర్యలతోనే కరోనాను కట్టడి చేయవచ్చు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలి. ప్రభుత్వానికి సహకరించాలి. -లోకేశ్ మల్హోత్రా, సివిల్ ఇంజినీర్
మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. కరోనాను పూర్తిగా నియంత్రించాలంటే ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. నైట్కర్ఫ్యూ అమల్లో ఉన్నా కేసులు తగ్గకపోవడంతో సీఎం కేసీఆర్ లాక్డౌన్ వైపు మొగ్గు చూపారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందే. -కోమల్సింగ్, ఉపాధ్యాయురాలు, సనత్నగర్
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం కేసీర్ లాక్డౌన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమే. ఓ వైపు వ్యాక్సిన్ ఇస్తూనే మరోవైపు రాష్ట్రం నుంచి కరోనాను పారదోలేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలి. – బుర్ర శ్రీనివాస్గౌడ్, సికింద్రాబాద్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
కరోనా నియంత్రణకు లాక్డౌనే అస్త్రం. లాక్డౌన్తో జన జీవనానికి కొంత ఇబ్బంది కలిగినా ఓర్చుకోవాల్సిందే. అందరి ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటికి వెళ్లాలి.-లాయక్ అలీ, ఆజంపురా చమన్
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకోవాలి. కరోనా కట్టడికి సహకరించాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలి. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. -కరోళ్ల కార్తీక్ ముదిరాజ్, మహేశ్వరం
రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నిర్ణయం కొన్ని వర్గాలకు ఇబ్బంది అయినా తప్పక పాటించాలి. అప్పుడు వైరస్ లింక్ తెగుతుంది. పాజిటివ్ కేసులు కూడా తగ్గుతాయి. రాష్ట్రంలో తిరిగి సాధారణ రోజులు రావాలంటే ప్రతిఒకరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాల్సిందే. -రాజమహేందర్రెడ్డి, తెలంగాణ వికాస సమితి నేత
ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతిఒక్కరూ నడుచుకోవాలి. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. చిన్నచిన్న కారణాలతో ఎవరూ రోడ్లు ఎక్కొద్దు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలి. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే పది నుంచి ఇరవై రోజుల్లో కరోనా కేసులు తగ్గే అవకాశం ఉంది.-కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, గంగపుత్ర సంఘం నేత