, మే 13(నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రెండో రోజు అదే స్ఫూర్తి కొనసాగిందని.. కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని.. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇండ్లలో ఉన్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. లాక్డౌన్ రెండో రోజు గురువారం నగరంలో పరిస్థితిని సీపీ.. ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ తదితర అధికారులు ట్యాంక్ బండ్ ప్రాంతంలోని చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని అన్ని విభాగాల పోలీసులు లాక్డౌన్లో పాల్గొంటున్నారని అన్నారు. పోలీసులు రోడ్లపై ఉండి అన్ని చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారని అన్నారు. తనిఖీల సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సీపీ సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా రంగంలోకి దిగారన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
సౌత్జోన్లో ఎక్కడ కూడా గుంపులుగా ఉండటంలేదని.. నిర్ణీత సమయానికి అన్ని దుకాణాలు మూసి వేశారని, ప్రజలు కూడా నాలుగు గంటల వ్యవధిలోనే షాపింగ్లు పూర్తి చేసుకొని ఇండ్లలోకి వెళ్లారని సీపీ వెల్లడించారు. సోషల్మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, కొందరు పాత వీడియోలను తీసి ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని.. అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల్లో ఇమామ్తో పాటు నలుగురు మాత్రమే ప్రార్థనలు చేయాలని, మిగతావారు ఎవరి ఇండ్లలో వారు ప్రార్థనలు చేసుకోవాలని సీపీ సూచించారు. బుధవారం వెబినార్లో మత పెద్దలు, రాజకీయ నాయకులు, మౌలానాలతో పాటు హోంమంత్రి కూడా పాల్గొన్నారని.. ఈ సందర్భంగా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని హోంమంత్రి సూచించారని సీపీ గుర్తు చేశారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తారని ఆశిస్తున్నామని సీపీ అన్నారు.