సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : పది రోజులు ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించి.. అందులో సడలింపు సమయాన్ని పెంచడంతో నగర రోడ్లపై ట్రాఫిక్ తగ్గింది. సడలింపు సమయాన్ని నాలుగు నుంచి ఏడు గంటలకు పెంచడంతో ముఖ్యంగా సోమవారం ఉదయం నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు నిదానంగా బయలు దేరుతూ తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుతున్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన లాక్డౌన్కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. అయితే కొందరు మాత్రం ఏదో ఒక వంకతో రోడ్లపైకి వస్తున్నారు. అలా కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలని నగరవాసులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సడలింపు సమయం పెరగడంతో వ్యాపారులు కూడా తమ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు సమయం ఉండటంతో వ్యాపార సముదాయాలను తెరిచే ఆలోచన చేస్తున్నారు. అయితే అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు మాత్రం యథావిధిగా కేసులు నమోదు చేస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు.
మే 12న మొదలైన లాక్డౌన్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఆ నాలుగు గంటల సమయంలో ముఖ్యంగా 8 గంటల తర్వాత చాలా మంది రోడ్లపైకి వచ్చారు. దీంతో ఆ రెండు గంటల్లోనే విపరీతమైన రద్దీ ఏర్పడేది. అదే సమయంలో అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది కూడా రోడ్లపైకి రావడంతో సాధారణ రోజుల్లో మాదిరిగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పెరిగిపోయింది. అయితే ప్రభుత్వం ఆదివారం మరోసారి లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు సడలింపుల సమయాన్ని పెంచడంతో సోమవారం ఉదయం రోడ్లపై ట్రాఫిక్ తగ్గింది. మరో మూడు గంటలు బయటికి వచ్చే అవకాశం ఉండటంతో నగర ప్రజలు రోడ్లపైకి నెమ్మదిగా వచ్చారు. మొత్తంగా ఉదయం వేళల్లో రెండు లక్షలు.. మధ్యాహ్నం 1.8లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నగరంలోకి వచ్చే సరుకు రవాణా వాహనాలకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తున్నాం. ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో ప్రజలు తమ పనులను ముగించుకొని నిర్ణీత సమయంలోగా గమ్యస్థానాలను చేరుకోవాలి. వ్యాపారస్తులు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగించాలి. -సీపీ అంజనీకుమార్