సిటీబ్యూరో/మేడ్చల్ మే 21 (నమస్తే తెలంగాణ ) : లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అనుమతి లేనివారు రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి హాజరయ్యారు. నగరంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఉదయం 10గంటల అనంతరం అనుమతి పొందిన వారు మినహా మరెవ్వరూ వీధుల్లో ఉండరాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అన్ని దవాఖానలకు పరిశుభ్రపరిచి పూర్తి స్థాయిలో లైటింగ్ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వే శుక్రవారంతో ముగిసిందని, వెంటనే తిరిగి రెండో విడత సర్వే ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. గ్రేటర్లో ఇప్పటి వరకు 2,68,000 మందికి అన్ని ప్రభుత్వ దవాఖానలు, బస్తీ దవాఖానల ద్వారా జ్వర పరీక్షలు చేశామని, జ్వరంతో ఉన్న వారికి ఉచితంగా మెడికల్ కిట్లు అందజేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11ప్రధాన దవాఖానలను పరిశుభ్ర పరిచి, లైటింగ్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ దవాఖానల్లో వృథాగా పడిఉన్న వస్తువులు, పాత ఫర్నీచర్ను పూర్తిగా తొలగించామని తెలిపారు.
హైదరాబాద్లో ఆక్సిజన్కు ఏ విధమైన కొరత లేదని, ప్రస్తుతం 5800 సిలిండర్లు అందుబాటులో ఉండగా, కేవలం 5వేల ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే సరిపోతున్నాయని కలెక్టర్ శ్వేతామహంతి చెప్పారు. హైదరాబాద్లో 720, మేడ్చల్లో 435 బృందాలతో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో అన్ని ముఖ్య దవాఖాలను పరిశుభ్రపరిచి తగు లైటింగ్ను ఏర్పాటు చేశామన్నారు.