‘తొమ్మిది తర్వాత షాపు ముందు ఖాళీ కనిపించదు… ఒకరి తర్వాత ఒకరికి సరుకులు ఇస్తుంటాం. ఆ సమయంలోనే గిరాకీ ఎక్కువ ఉంటున్నది. ప్రజలు క్రమశిక్షణ మరిచారు. ఎంత చెప్పినా భౌతిక దూరం పాటించడం లేదు’ ఇది ఓ షాపు యజమాని మాట…అవును ఉదయం 9 అయ్యిందంటే చాలు.. నగరం కిక్కిరిసిపోతున్నది.. రహదారులన్నీ రద్దీగా మారుతున్నాయి. షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా వైరస్ ముప్పు పొంచి ఉంటున్నది. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించి… ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చింది. అయితే కొందరి నిర్లక్ష్యం కారణంగా ఆ చివరి గంట ‘సడలింపులో సడేమియాలా కరోనా కాచుకుకూర్చుంటున్నది. సమయం మించిపోతున్నదన్న తొందర్లో హడావుడిగా సరుకుల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. భౌతికదూరం మరిచిపోతున్నారు. కొందరైతే మాస్కులు సైతం సరిగా ధరించడం లేదు. ఇక షాపు యజమానులు సైతం వ్యాపారంపైనే ధ్యాస పెడుతున్నారు. షాపుల ముందు కొవిడ్ నిబంధనలు కాగితంపై రాసి పెడుతున్నా..ఆచరణలో చూపడం లేదు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సిటీబ్యూరో, మే 18 (నమస్తేతెలంగాణ) : లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు. అంటే కేవలం నాలుగు గంటలు మాత్రమే. ఈ సమయంలో నిత్యావసరాలు, ఇతర అత్యవసరమైనవి కొనుగోలు చేయాలని సమయం ఇచ్చారు. అయితే చాలామంది ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కొనుగోళ్లకు బయటకు రావడం, దుకాణాల వద్ద ఎగబడడం, భౌతికదూరం పాటించకపోవడంతో వైరస్ బారిన పడే ప్రమాదముదన్నది. ప్రధానంగా 9 నుంచి 10 గంటల మధ్య అంటే ఒక్క గంటలో అధికంగా కొనుగోలు చేస్తూ కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. షాపులు మూసేసే సమయం ముగుస్తుండటం..త్వరగా గిరాకీ పూర్తి చేయాలనే ఆలోచనతో షాపింగ్ సిబ్బంది వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. కస్టమర్లలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వందలాది మంది కొవిడ్ బోనులోకి వెళ్లాల్సి ఉంటుంది. ‘నోమాస్క్-నో ఎంట్రీ, క్యూ పాటించకపోతే సరుకులు లేవు’ అనే నినాదాలు చివరి సమయంలో ఎవరికీ పట్టడం లేదు.
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపులో ముఖ్యంగా 9 నుంచి 10 మధ్యలో దుకాణాలు, షాపింగ్మాల్స్ కిటకిటలాడుతున్నాయి. రహదారులు వాహనాలతో తీవ్ర రద్దీగా మారుతున్నాయి. దీంతో చాలావరకు కొవిడ్ నిబంధనలు పాటించడం కష్టంగా మారింది. చివరి రెండు గంటలే గిరాకీకి సరైన సమయమని, ఈ టైంలోనే జనం ఇంట్లో నుంచి బయటకు ఎక్కువగా వస్తున్నారని దుకాణాదారులు అంటున్నారు. ఇక ఆ సమయంలో భౌతికదూరానికి చోటులేకుండా పోతుందని వాపోతున్నారు. సాధారణంగా నగరవాసులు రాత్రులు ఆలస్యంగా నిద్రించడం, ఉదయం ఆలస్యంగా లేవడం కూడా రద్దీకి కారణంగా చెప్పొచ్చు.