సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సడలింపు సమయంలో చాలా ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, మాంసం విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద రద్దీ విపరీతంగా ఉంటున్నది. జనం మాస్కులు ధరిస్తున్నప్పటికీ చాలా మంది భౌతికదూరం పాటించడం లేదు. ముఖ్యంగా మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 8 తర్వాతే ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. ఎగబడి షాపింగ్ చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్నట్లు భావిస్తున్నారు. వైరస్ చైన్ను బ్రేక్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు వినూత్న ఆలోచన చేస్తున్నారు.
రద్దీ తగ్గకపోతే లాక్డౌన్ సడలింపు సమయంలో మార్కెట్లలో ఓ రోజు సంపూర్ణంగా లాక్డౌన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్లు, మాంస విక్రయ కేంద్రాలు, వాణిజ్య దుకాణ సముదాయాల ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. వాటిపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ లాక్డౌన్ ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాలను పరిశీలించి.. కొన్ని హాట్స్పాట్లను గుర్తించారు. అక్కడి వ్యాపారులతో మాట్లాడి ఓ రోజు మార్కెట్ హాలిడే ప్రకటించి.. వైరస్ చైన్కు బ్రేక్ వేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.