సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా జరుపుకున్న బర్త్డే పార్టీ.. 60 మందిని అడ్డంగా బుక్ చేసింది . అర్ధరాత్రి మద్యం జోష్లో మ్యూజిక్కు చిందేసిన వారందరీ నషా దించేలా సైబరాబాద్ పోలీసులు చట్టపరంగా చర్యలకు దిగారు. హైదరాబాద్ శివారు కడ్తాల్లోని బాక్స్ ఫాంహౌజ్లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న 60 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలను మోపారు.
వీరందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. పార్టీకి హాజరైన వారంతా ఐటీ ఉద్యోగులే.. కాగా పోలీసులు ఈ 60 మంది పనిచేస్తున్న కంపెనీలకు లేఖలు రాసి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైనంపై వివరించనున్నారు. దీంతో వారి వ్యక్తిగత ప్రవర్తనపై రీమార్క్ ఏర్పడనుంది. ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలో సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులైన భరత్, జీషాన్, అన్వేష్లను ఆదివారం అరెస్ట్ చేయగా.. బర్త్డే బాయ్ వరుణ్గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.