కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 15: రోడ్డు వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధివ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తోంది. అంతంత మాత్రంగా వ్యాపారాలు నడుస్తున్న వేళ.. కరోనా, లాక్డౌన్తో వీధి వ్యాపారులు, చిరువ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణ సహాయం అందించి వారి జీవితాలు కుదుటపడేలా తోడ్పాటునిస్తోంది. తక్షణ సహాయం కింద మొదటి విడతలో ఇప్పటికే రూ.10 వేల రుణాన్ని అందించింది. ఆ రుణాలను తీసుకొని సక్రమంగా చెల్లించినవారికి రెండో విడతలో రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి ఇచ్చిన మాటను నిలుపుకున్నది. దీంతో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల జీవితాల్లో ప్రస్తుతం కొంతమార్పు కనిపిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో రుణాలు మంజూరు చేసేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్లు సర్వే నిర్వహించి వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను గుర్తించారు. జిల్లాలో మొత్తం12,961 మంది వీధి వ్యాపారులు, రోడ్ల వెంట వ్యాపారం చేసేవారున్నట్లు గుర్తించారు. వారందరికీ అర్హతను బట్టి మొదటి విడత రూ.10 వేలు, వాయిదాలు సక్రమంగా చెల్లించినవారికి రెండో విడతలో రూ.20 వేలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 4,706 మంది వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. వారిలో మొదటి విడతలో రూ.10 వేల రుణానికి 3,022 మంది దరఖాస్తు చేసుకోగా 2,935 మందికి రుణాలు మంజూరు చేశారు. అందులో 2,884 మందికి వారి బ్యాంకు ఖాతాల్లో రుణ మొత్తం జమ అయింది. మొత్తంగా రూ.2.88 కోట్లను రుణంగా అందజేశారు.
ప్రతి నెలా వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారిలో రెండో విడతలో 1,808 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,070 మంది రుణ అర్హత సాధించారు. ఇందులో 523 మందికి మొత్తం రూ.1.4 కోట్లను వారి బ్యాంకు ఖాతాకు జమ చేశారు. పాల్వంచ మున్సిపాలిటీలో 4,489 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. రుణం కోసం 3,651 మంది దరఖాస్తు చేసుకోగా 3,493 మంది అర్హత సాధించారు. 3,427 మంది ఖాతాల్లో రూ.3.42 కోట్లను జమ చేశారు. రెండో విడత రుణం కోసం 1,262 మంది అర్హత సాధించగా వారిలో 866 మందికి ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1.8 కోట్లను జమ చేశారు. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో మొత్తం 1,854 మంది చిరు వ్యాపారులను గుర్తించారు. 1,669 మంది దరఖాస్తు చేసుకోగా 1,552 మందికి రుణాలను అందించారు. రూ.1.55 కోట్లు, రెండో విడతలో 749 మంది అర్హత సాధించగా 545 మందికి రూ.20 వేల చొప్పున రూ.1. 09 కోట్లను జమ చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో 1,912 మంది వీధి వ్యాపారులను గుర్తించగా.. వారిలో 1,692 మంది దరఖాస్తు చేసుకోగా 1,624 మందికి రుణాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వారిలో 1,590 మందికి మొదటి విడతలో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.1.59 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో 705 మంది దరఖాస్తు చేసుకోగా 651 మందిని అర్హులుగా గుర్తించి అందులో 308 మందికి రూ.1.22 కోట్లను జమ చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి విడతలో రూ.9.45 కోట్లు, రెండో విడతలో రూ.4.24 కోట్లు మొత్తంగా రూ.13.50 కోట్లను అందజేశారు.
నా దగ్గర ఉన్న కొంత మొత్తంతోపాటు అధికారులు ఇచ్చిన రుణంతో కుర్కురే ప్యాకెట్లు, చాక్లెట్ల వ్యాపారం ప్రారంభించాను. మొదటి విడత తీసుకున్న నగదును సక్రమంగా చెల్లించి రెండో విడత కూడా రుణం తీసుకున్నాను. వ్యాపారం కోసం ఇచ్చిన రుణాన్ని వ్యాపార నిమిత్తమే ఖర్చు చేయడం వల్ల కొంత కుదుటపడ్డాను. కరోనా వేళ ఇబ్బందులుపడ్డాను. ఆ ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వం అందించిన రుణ సహాయంతో వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నాను. ప్రస్తుతం వ్యాపారం స్థిరంగానే సాగుతోంది.
-ఐతా సరస్వతి, హనుమాన్బస్తీ
ప్రభుత్వ నుంచి రుణం తీసుకొని వెదురుబొంగుల వ్యాపారం నిర్వహిస్తున్నాను. నా వద్ద ఉన్న కొంత పెట్టుబడితోపాటు ప్రభుత్వం ఇచ్చిన రెండు విడతల రుణాన్నీ తీసుకొని చలువ పందిళ్ల డెకరేషన్, వెదురు కర్రల వ్యాపారం చేస్తున్నాను. ప్రస్తుతం వ్యాపారం ఆశాజనకంగానే ఉంది. మూడో విడతలో రూ.50 వేల రుణసహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాను.
-కొండ సంజీవరావు, మేదరబస్తీ
ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణాన్ని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. రెండు విడతలు రుణ సహాయం పొందినవారు తమ వాయిదాలను సక్రమంగా చెల్లించాలి. అలా చెల్లించిన వారికి మూడో విడతలోనూ రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపార నిర్వహణ కోసం తీసుకున్న రుణాన్ని వ్యాపారాభివృద్ధి కోసమే వినియోగించాలి.
-జి.రఘు, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం