సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): రుణ యాప్ల కేసులో ఫ్రీజ్ చేసిన ఖాతాలను డీఫ్రీజ్ చేయించేందుకు విదేశాల నుంచి కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, ఇండోనేషియాలో ఉంటూ చక్రం తిప్పుతుందని భావిస్తున్న జెన్నీఫర్ పరోక్షంగా రంగంలోకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఢిల్లీ, గురుగావ్లో తిరిగిన సమయంలో ఉన్న పరిచయాలతో బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే గ్యాంగ్లను జెన్నీఫర్ టీమ్ సంప్రదించింది. అందులో తెలుగువాళ్లు కూడా ఉండటంతో వాళ్లకు కలిసి వచ్చింది. హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, చాలా ఖాతాలు ఫ్రీజ్ చేశారు. వాటిని విడిపించడంపై వారితో చర్చించారు. ఎక్కువ ఖాతాలు ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్తే సమస్య వస్తుందని భావించిన ఈ గ్యాంగ్, తక్కువ ఖాతాలు ఫ్రీజ్ అయిన కోల్కత్తను ఎంచుకొని, అక్కడ పోలీసుల అవతారమెత్తి, బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించారు.
కోల్కత్తలోని ఐసీఐసీఐ బ్యాంకుకు బురిడీ కొట్టించి డీఫ్రీజ్ చేయించి అక్కడి నుంచి రూ.1.18 కోట్లు హైదరాబాద్లోని ఆనంద్ జన్ను ఖాతాకు తరలించారు. హైదరాబాద్ నుంచి ముంబైలోని యాక్సెస్ బ్యాంకులో ఉన్న అనిల్ ఖాతాకు ఆ డబ్బు బదిలీ అయ్యింది. ముంబై నుంచి ఈ డబ్బు ఎక్కడకు వెళ్లింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనిల్ ఖాతాలోకి వెళ్లిన డబ్బు మాత్రం ప్రస్తుతం అతని ఖాతాలో లేదని పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే ఏజెంట్ అనిల్ను 2015లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే గ్యాంగ్ సభ్యుడిగా తేలింది. అదే అనిల్ ఇప్పుడు చైనా కంపెనీలకు చెందిన లోన్యాప్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు డీఫ్రీజ్ చేయించడంలో కీలకంగా వ్యవహరించాడు. మల్కాజిగిరికి చెందిన అనిల్ ఒక్కో సారి ఒకో ప్రాంతంలో ఉంటాడు. ఈ కేసులో బేగంపేట్కు చెందిన ఆనంద్ జన్నుకు కొంత కమీషన్ ఇచ్చి అతని ఖాతాను వాడుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆనంద్ జన్నును సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ కోసం గాలిస్తున్నారు.