సిటీబ్యూరో, అక్టోబరు 14 (నమస్తేతెలంగాణ) : ప్రధాన రహదారులకు అనుసంధానం పెంచడంతోపాటు ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నది. దూర ప్రాంతాలను కలిపేలా ఖాళీ స్థలాలు, కాలనీల మీదుగా విశాలమైన రోడ్లను నిర్మిస్తూ ప్రత్యామ్నాయ రోడ్లతో వెస్ట్ కారిడార్లో దాదాపు 22కు పైగా చేపట్టడంతో ట్రాఫిక్ రద్దీ చాలావరకు తగ్గింది.
తొలివిడుత పనులు పూర్తికాగా, ఇటీవల రెండోవిడుతగా రూ.232.62 కోట్లతో 13 చోట్ల 21.98 కిలోమీటర్ల మేర లింకు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. రెండురోజుల క్రితం సుమారు రూ.33.14 కోట్ల అంచనాతో రెండు చోట్ల లింకు రోడ్ల పనులకు టెండర్ల ఆహ్వానించారు.
క్రాంతివనం లేఅవుట్ నుంచి భాగ్యలక్ష్మి లేఅవుట్ మీదుగా నార్నే రోడ్ అనుసంధానం చేస్తూ 2.40 కిలోమీటర్ల పనులకు రూ.12 కోట్లు, నల్లగండ్ల రాణాప్రతాప్ టవర్ నుంచి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కార్యాలయం వరకు 1.80 కిలోమీటర్ల పనులకు రూ.21.34 కోట్లతో టెండర్లు పిలిచారు. తాజాగా బంజారాహిల్స్, అంబర్పేట, రాజేంద్రనగర్ పరిధిలో మూడుచోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. దాదాపు రూ.60 కోట్లతో ఈ పనులను నెలాఖరులో ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసేందుకు హెచ్ఆర్డీసీఎల్ చర్యలు చేపడుతున్నది.