రూ. 72 కోట్లతో ప్రతిపాదనలు
త్వరలో టెండర్లు.. పనులు
సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నగరవాసుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లింకు రోడ్ల నిర్మా ణం సత్ఫలితాలనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరంలోనే అత్యధికంగా రద్దీగా ఉంటే ఐటీ కారిడార్లో ఐదు చోట్ల ఈ తరహా రహదారులను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ల్యాంకోహిల్స్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు వరకు, పుప్పాలగూడ, పరిసర ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తూ.. .2.35 కిలోమీటర్ల మేర రెండు లింకు రోడ్లు, ఓఆర్ఆర్ నుంచి విప్రో జంక్షన్ -ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బీ రోడ్డు వరకు 2.25 కి.మీ, ల్యాంకోహిల్స్ నుంచి అనన్వ కన్వెన్షన్, హైటెక్సిటీ హ్యుండ య్ షోరూం పక్క నుంచి ఎన్ఏసీ బ్యాక్ గేటు వరకు, అటు నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
వీటికి రూ. 72 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ అధికారులతో కలిసి సాధ్యాసాధ్యా లను పరిశీలించారు. త్వరలో భూసేకరణ..పనులకు టెండర్లు ఆహ్వానించనున్నామని అధికారులు వెల్లడించారు. ఈ లింకు రోడ్లు పూర్తయితే.. పలు ప్రాంతాల మధ్య దూరం తగ్గి ప్రయాణం మరింత చేరువ కానున్నది.