సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్వ్యాప్తంగా దూరప్రాంతాలను మరింత దగ్గర చేసేందుకు మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)లు యుద్ధప్రాతిపదికన చేపట్టిన లింకు రోడ్లు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు కొలువుదీరిన వెస్ట్జోన్(పశ్చిమాన)లో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఇప్పటికే పలుచోట్ల లింకు రోడ్లను అందుబాటులోకి తెచ్చి ప్రయాణాన్ని సులభతరం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.23.43 కోట్లతో చేపట్టిన నాలుగు లింక్ రోడ్లను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, విద్యామంత్రి సబితారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలతో కలిసి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
30 మీటర్ల వెడల్పుతో నిర్మించిన లింక్ రోడ్ల వల్ల సమయం ఆదాతోపాటు ఇంధన వ్యయం బాగా తగ్గనుంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని నివారించొచ్చు. 126.20 కిలోమీటర్ల విస్తీర్ణంలో 135 లింక్ రోడ్లను నిర్మిస్తుండగా, మొదటిదశలో రూ.313.65 కోట్లతో 37 మిస్సింగ్ రోడ్ల పనులు ప్రారంభించారు. 23 రోడ్ల నిర్మాణానికి టౌన్ప్లానింగ్ అధికారులు భూసేకరణ పూర్తి చేశారు.
కారిడార్-1 :- నిజాంపేట క్రాస్రోడ్ నుంచి ట్రావెసెస్ వయా వసంత్నగర్, కేపీహెచ్బీ ఫేజ్-6, వెంకటరమణ కాలనీ, మహేంద్ర అశ్విత లైఫ్ స్పెసెస్ గేటెడ్ కమ్యూనిటీ, అక్కడి నుంచి విజ్ఞాన్ స్కూల్ మీదుగా వసంత సిటీ, న్యాక్ కంపౌండ్ మీదుగా కొండాపూర్ గల్ప్ కోర్ట్ వరకు ఈ రహదారి నిర్మాణ పనులు జరిపారు. ఎన్హెచ్ 65 నుంచి హైటెక్సిటీ, కొండాపూర్కు అనుసంధానం ద్వారా ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
కారిడార్-3 :- ఎన్హెచ్ 65 జలమండలి కార్యాలయం నుంచి వయా డైమండ్ హిల్స్ కాలనీ, ఐడీపీఎల్ ఎంఫ్లాయీస్ కాలనీ, శిల్పా ఎవెన్యూ కాలనీ, నోవాటెల్ రోడ్ సర్కిల్ మీదుగా కొండాపూర్ మజీద్ జంక్షన్ గచ్చిబౌలి వరకు, అక్కడి నుంచి మియాపూర్ రోడ్కు అనుసంధానం చేసి వాహనదారులకు సమయం, ప్రయాణ దూరాన్ని తగ్గించారు.
కారిడార్-43 :- నోవాటెల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్స్ ఎంఎంటీఎస్, కొండాపూర్, హఫీజ్పేట, మియాపూర్, గచ్చిబౌలి అనుసంధానం ఈ లింకు రోడ్ల నిర్మాణంతో నిజాంపేట, హైటెక్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది.
కారిడార్-12 :- జేవీ హిల్స్ పార్క్ నుంచి మజీద్ బండ రోడ్ మీదుగా ప్రభుపాద లే అవుట్ వరకు ఈ రహదారి నిర్మాణం జరిగింది. జేవీ హిల్స్ వద్ద ప్రారంభం కాగా మాదవ ఎస్టేట్స్, గచ్చిబౌలి మజీద్ బండ రోడ్, ప్రభుపాద లే అవుట్, మారుతి నగర్ వరకు దాదాపు 0.9 కిలోమీటర్ల మేర పనులు జరిపారు.