ప్రయాణ దూరం తగ్గించి.. సమయం.. ఇంధనం ఆదా చేసే మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చుతున్నాయి. స్వల్ప వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. మొత్తం 133 ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి హెచ్ఆర్డీసీఎల్ శ్రీకారం చుట్టగా, మొదటిదశలో రూ. 313.65 కోట్లతో 22 రోడ్లు నిర్మిస్తున్నారు. దశల వారీగా వాటిని అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులోభాగంగా సోమవారం వెస్ట్కారిడార్లో రూ. 27.43 కోట్లతో నిర్మించిన మరో ఐదు లింక్రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రహదారులు అభివృద్ధికి సూచికలు అని చెప్పిన ఆయన.. రెండో విడుతలో రూ.232.62 కోట్ల వ్యయంతో మరో 13 రోడ్లను నిర్మిస్తామని వెల్లడించారు.
నగరాభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే రూ. 6వేల కోట్ల వ్యయంతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు, రూ.1800కోట్ల వ్యయంతో సీఆర్ఎంపీ ప్రాజెక్టు ద్వారా పలు రహదారుల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశలో రూ.313.65కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పటికే 16 రహదారులను పూర్తి చేశాం. వీటితో నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. త్వరలోనే మరో ఆరు రహదారులను అభివృద్ధి చేస్తాం. ఏ మెట్రో నగరాల్లో లేని విధంగా గ్రేటర్లో లింకు రోడ్లను నిర్మిస్తున్నాం. – కేటీఆర్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి
సిటీబ్యూరో/మాదాపూర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ) : ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా వెస్ట్ కారిడార్లో మరో ఐదు లింకు రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు నగరంలో రూ.313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ పరిధిలో రూ. 27.43కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఐదు లింకు రోడ్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలతో కలిసి సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హెచ్ఆర్డీసీఎల్ సీఈ జియావుద్దీన్, వెస్ట్ జోన్ కమిషనర్ రవికిరణ్లతో పాటు కార్పొరేటర్ వి.జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్లోని సైబర్ విలేజ్ కాలనీ వాసులు స్కూల్ వైపు ఉన్న ఖాళీ స్థలంలోనుంచి లింకు రోడ్డు ఏర్పాటు చేపట్టాలని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. లింక్ రోడ్లు ప్రజల ఇబ్బం దులను తొలగించడానికేనని మంత్రి అన్నారు. కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్డీసీఎల్ సీఈ జియావుద్దీన్కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోడ్లతో దూరభారం తగ్గనుంది. ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం కలుగుతుంది. గతంలో గంటల తరబడి ప్రయాణ సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలో తమ గమ్య స్థానాలకు చేరుకునేలా ఈ లింకు రోడ్లు దోహదపడనున్నాయి.
ఒకప్పుడు కొండాపూర్ నుంచి మాదాపూర్ నోవాటెల్ వెళ్ళడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు సమయం పట్టేది. కానీ లింకు రోడ్ల నిర్మాణంతో కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మాదాపూర్కు చేరుకోవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇటువంటి వ్యూహాత్మక రహదారులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. – సత్తిరెడ్డి, న్యూ సైబర్ వ్యాలీ
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభు త్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు తీసుకురావడం సంతోషం. కొండాపూర్ మీదుగా మాదాపూర్ వెళ్లాలంటే కిమ్స్ దవాఖాన మీదుగా వెళ్లాల్సి వస్తుంది. నూతనంగా ఏర్పాటు చేసిన లింకు రోడ్డుతో కేవలం 3నిమిషాల్లోనే నోవాటెల్ ఆపై మాదాపూర్ చేరుకోవచ్చు. – మహేశ్, భిక్షపతినగర్
చందానగర్ సర్కిల్ పారిశుధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలుకరించారు. ఆమె తలపై ధరించిన టోపీ బాగుందంటూ, క్యాప్ సరిచేసి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింకు రోడ్ను ప్రారంభించి వెళుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సైదమ్మతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం ఎలా ఉంది.. జీతం సరిగా వస్తుందా.. అని మంత్రి కేటీఆర్ అడుగగా.. మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది అని సైదమ్మ బదులిచ్చారు. ఇందుకు స్పందించిన కేటీఆర్ రెండు సార్లు కాదమ్మా.. మూడు సార్లు పెంచాం అని బదులిచ్చారు. ఒకప్పుడు చాలీచాలని జీతాలతో కుటుంబం గడువలేని పరిస్థితి ఉండే.. ఇప్పుడు సమయానికి జీతాలు అందుతున్నాయి.. సారూ.. మీరు సల్లగా ఉండాలని సైదమ్మ ప్రభుత్వాన్ని మనసారా దీవించింది.. అనంతరం ఫొటో దిగుదామా.. అని అడిగి సైదమ్మతో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఫొటో దిగారు.
లింకు రోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ను కొంత మంది పాఠశాల విద్యార్థులు కలిశారు. వారితో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా సార్.. పాఠశాలలు ఎప్పుడు తీస్తారు? స్కూలుకు వెళ్లాలని ఉంది.. అని చిన్నారులు మంత్రిని అడిగారు. దీంతో మంత్రి కేటీఆర్ నవ్వుతూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇక్కడే ఉన్నారని, కొవిడ్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చిన్నారులతో చెప్పారు.