చిక్కడపల్లి :గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి జీవనశైలిలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కేర్ హాస్పిటల్ బంజరాహీల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ పీఎల్ఎన్ కపర్తి అన్నారు. సోమవారం గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె జబ్బులపై అవగాహన కల్పించడానికిప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందులో భాగంగా ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చౌరస్తాలో మేడినోరా సూపర్స్పెషాలిటి డయాగ్నోస్టిక్స్ ఉచిత కార్డియకర్ కేర్ క్లినిక్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. కేర్ హాస్పిటల్ బంజరాహీల్స్ సీఈఓ రాహుల్ పర్యావేక్షణలో ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గుండెజబ్బులకు గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజు రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా వంటి రోజువారీ వ్యాయామలు తప్పకుండా చేయాలని సూచించారు. స్మోకింగ్,మద్యానికి దూరంగా ఉంటే చాల మంచిదని ఆయన సూచించారు. పనిచేసే స్థలాల్లో, ఇంట్లో ఒత్తిడిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, ఎక్కువగా పండ్లు,కూరగాయాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వివరించారు.