సిటీబ్యూరో/హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): అవి కోట్ల రూపాయల విలువజేసే ఖరీదైన కార్లు. మైలేజీ తక్కువైనా.. లైట్ తీసుకునే వాహనదారులు వాటి కి ఓనర్లు.. షోప్టాప్కు ఎక్కడా వెనకాడని ఆ వాహనాల యజమానులు పన్ను చెల్లించడానికి మాత్రం ముందుకురావడం లేదు. లైఫ్టాక్స్,జరిమానాలు చెల్లించకుండా ఖరీదైన కార్లల్లో షికారు చేస్తున్నారు. నగర రోడ్లపై రయ్య్మ్రంటూ యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. ఇలాం టి వారిపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆ లగ్జరీ వెహికిల్స్ను సీజ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన డ్రైవ్లో సుమారు 11 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. ఈ వాహనాలపై రూ. 30 కోట్లకు పైగా ఆదాయం ఆర్టీఏ ఖజానాకు జమ కానున్నది. రూ. కోటి అంతకుపైగా ధర కల్గిన కార్లు హైదరాబాద్లో 959 వరకు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
పన్ను ఎగవేస్తున్న కార్ల యజమానులను గుర్తించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, స్థానిక పోలీసుల సహకారం సహా పలుమార్గాల్లో సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 నుంచి 100 వరకు ఈ తరహా లగ్జరీ కార్లు పన్నులు చెల్లించకుండా రాష్ట్ర రోడ్ల పై తిరుగతున్నట్టు గుర్తించామని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆదివారం నిర్వహించినట్టుగానే ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఇలాంటి వాహనాల పన్నులను వసూలు చేస్తే రూ.150 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీఏ అధికారులకు పట్టుబడుతున్న లగ్జరీకార్లలో చాలా వరకు పుదుచ్చేరి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కార్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పుదుచ్చేరిలో రూ.20 లక్షలపైన ఖరీదైన కార్లకు ఏడాదికి కేవలం రూ.14వేలు మాత్రమే పన్ను ఉంటుంది. మహారాష్ట్రలోనూ రూ.20 లక్షలు మాత్రమే.. తెలంగాణలో రూ.10 లక్షలు పైన ధర ఉన్న వాహనాలకు లైఫ్ట్యాక్స్ను కొత్త వాహనాలకు ఇన్వాయిస్ విలువపై14శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహనం కొనుగోలు చేసిన ఏండ్లను బట్టి 12 ఏండ్ల పైబడిన వాహనాలకు 7.5శాతం వరకు తగ్గుతుందని, ఈ కారణంతోనే ఇతర రాష్ర్టాల్లో ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్నట్టు వారు వివరించారు.
పట్టుబడుతున్న వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా?.. లేవా అన్న అంశాలపైనా ఆర్టీఏ అధికారులు దృష్టి పెడుతున్నారు. ఏవైన వాహనాలు సరైన అనుమతులు లేకున్నా, ఇంకేమైనా అతిక్రమణలు ఉన్నా పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ముంబై వింగ్ అధికారులు లగ్జరీకార్ల స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించి మలక్పేట్లోనూ కార్లను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ తరహా కేసుకు సంబంధించినవి ఏవైనా ఉన్నట్టు తేలితే డీఆర్ఐ అధికారులకు తెలంగాణ ఆర్టీఏ నుంచి లేఖ రాయనున్నట్టు పేర్కొన్నారు.
పన్ను చెల్లించకుండా వాహనాలను నడపడం నేరం. కచ్చితంగా ఇతర రాష్ర్టాల వాహనాలను ఇక్కడ నడపాలనుకుంటే లైఫ్టాక్స్ చెల్లించాలి. ఇష్టారాజ్యంగా పన్ను ఎగవేసి వాహనాలను నడిపితే సీజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే.పాపరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటికే పలు లగ్జరీ వాహనాలను సీజ్ చేశాం. లైఫ్టాక్స్ కాలపరిమితి 15 ఏండ్లు ఉంటుంది. చాలా మంది పన్ను చెల్లించలేదని గుర్తుంచాం. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. -సురేశ్ రెడ్డి, ఆర్టీఓ, నాగోల్