బంజారాహిల్స్,సెప్టెంబర్ 3 : చిత్రపురి కాలనీ భూవివాదం అవకతవకల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిలింఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఇందిరానగర్లోని మేకప్ ఆర్టిస్ట్స్ అసోయేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. సినీ కార్మికులకు రావాల్సి ఇండ్లను అనర్హులకు కేటాయించారని పోరాటం చేస్తున్న తెలంగాణ సాధన సమితికి తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ మద్దతు ఇచ్చిందన్నారు.
అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి తలసాని మీద సాధన సమితి నేతలు సీహెచ్.భద్రి, కస్తూరి శ్రీనివాస్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఒకవేళ మంత్రులకు డబ్బులు ముట్టాయని నిరూపించగలిగితేనే ఆరోపణలు చేయాలని కానీ అనవసరమైన ఆరోపణలు, అసభ్యకరమైన మాటలు సరికావన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు.
సినీ కార్మికులకు న్యాయం చేసేందుకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎల్లవేళలా సిద్దంగా ఉంటుందని, చిత్రపురిలో జరిగిన అవకతవకలపై పోరాటం చేయాల్సిందే. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో కార్మికులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మేకప్ యూనియన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి మూర్తి, కోశాధికారి సాగర్, కేశవ్, రీతు, తదితరులు పాల్గొన్నారు.