ప్రజలు నేడు నిత్యం వస్తు సేవలపై ఆధారపడుతున్నారు. ఉదయం లేచింది మొదలు ప్రతీది కొనుగోలు చేయాల్సిందే. నిత్యావసరాలైన పప్పులు, ఉప్పులు మొదలు తదితర అన్నీ కొనుగోలు చేస్తుంటారు. అయితే మనం కొనుగోలు చేసిన వస్తువు నాణ్యంగా ఉన్నదా.. కొలతలు సరిగ్గా ఉన్నాయా అంటే అనుమానమే. నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండని వస్తువులు వినియోగదారుడికి దొరకనప్పుడు ఏం చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి. మనం పెట్టిన డబ్బులకు ఆశించిన ప్రతిఫలం అందలేదని ఊరుకోవాలా.? ధనం వృథా అయ్యిందని మిన్నకుండాలా.. అవసరం లేదు. లీగల్ మెట్రాలజీకి ఒక్క ఫిర్యాదు చేస్తే 48గంటల్లో చర్యలు తీసుకుంటారు.
మేడ్చల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తూనికలు, కొలతల శాఖ అధికారులు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తక్కువ తూకం, తక్కువ కొలతలు వేస్తూ వస్తువులపై ముద్రించిన ధరలకు మించి విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన 705మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సత్యనారాయణ తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు 705మంది వ్యాపారులపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.74లక్షల 52 వేల జరిమానాలు విధించారు.
తూనిక రాళ్లకు ప్రతి రెండేండ్లకోసారి తూనికలు, కొలతల శాఖ నుంచి ప్రామాణిక ముద్రలు వేయించుకోవాలి. ఇందుకు కొంత నగదును తూనికలు, కొలతల శాఖకు ఫీజు రూపంలో చెల్లించాలి. అదే ఎలక్ట్రానిక్ కాటా అయితే ఏడాదికి ఒకసారి తనిఖీలు చేయించుకొని స్టాంపులు వేయించుకోవాలి. ఇందుకు 2020-2021 వార్షిక సంవత్సరానికి రూ.1,75,10,865 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వ్యాపారులు 70శాతం మంది ప్రామాణిక ముద్రలు వేయించుకోవడంలేదు. వ్యాపారాలు ఊపుగా ఉన్నవారు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే ఇలా చేస్తున్నారు. అధికారులు తమ లక్ష్యాలను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో అడపాదడపా దాడులు చేసి మొక్కుబడిగా ముగిస్తున్నారు. పలు చోట్ల తోపుడు, కూరగాయల మార్కెట్లు, కిరాణా వ్యాపారాల్లో ఇప్పటికీ పాతపద్ధతిలోనే విక్రయిస్తున్నారు. సగటున కిలోకు 100గ్రాముల వరకు నష్టపోతున్నట్లు అంచనా.. ఇదిలా ఉండగా వ్యాపారులు వినియోగించే తూనికలు, కొలతల యంత్రాలపై తప్పనిసరిగా ప్రామాణిక ముద్రలు వేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వినియోగదారులు మోసాలకు గురికాకుండా జిల్లా లీగల్ మెట్రాలజీ చర్యలు తీసుకుంటుంది. వ్యాపారస్తులు వినియోగిస్తున్న తూనికలు, కొలతలను సరిచూసి రెండేండ్లకు ఒకసారి అధికారిక ముద్రలు వేస్తాం. ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు వస్తు సేవలు పొందే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిత తనిఖీలు నిర్వహించి 2020-21 వరకు 705మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశాం. రూ.74లక్షల 52వేలు జరిమానాలు విధించాం. ముఖ్యంగా పెట్రోల్ బంక్లో పెట్రోలు పోసుకునే ముందు తప్పనిసరిగా 0 పాయింట్ను చూసిన తర్వాతే పెట్రోల్ పోయించుకోవాలి. -మేడ్చల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సత్యనారాయణ
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను 48గంటల్లో పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్ లేదా టోల్ఫ్రీ నంబర్ 1860425333, సెల్ నంబర్ 9398977514, email: aclmts@nic.in, లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించి న్యాయం చేయనున్నారు.