శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రమంతటా లాక్డౌన్
దేశంలో ఒక్కరోజే 93,249 కేసులు
పగటిపూట 144 సెక్షన్ థియేటర్లు మూసివేత
మాల్స్, బార్లు, రెస్టారెంట్లు పార్శిళ్లకే పరిమితం
ముంబై: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయి. వారంతపు లాక్డౌన్తో పాటు రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది. వారమంతా పగటిపూట 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో ఐదుగురి కంటే ఎక్కువమంది ఒకచోట కలిసి ఉండకూడదు. ఈ ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయి. షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలకు పార్శిళ్లు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. పని ప్రదేశాల్లో కార్మికులకు నివాస సదుపాయం ఉంటేనే భవన నిర్మాణాలను అనుమతిస్తారు. సినిమా, డ్రామా థియేటర్లు, పార్కులు, క్రీడా మైదానాలను తెరువరు. పరిమిత సిబ్బందితో సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్వోపీలు) పాటించాలి. ప్రజా రవాణా వ్యవస్థ యథావిధిగా పనిచేస్తుంది. మరోవైపు, కరోనా కట్టడికి మైక్రో (చిన్నపాటి) లాక్డౌన్లు అవసరమని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్, కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు రణదీప్ గులేరియా సూచించారు.
ఒక్కరోజులో 93,249 కరోనా కేసులు
భారత్లో ఆదివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు.. నలుగురి మృతి