యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం సోమవారం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. ఉదయం 11.06 గంటలకు బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 7.30గంటలకు కొండకింద ఉన్న పాత ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైభవోత్సవ కల్యాణం నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పణ యాదాద్రీశుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు డాలర్ శేషాద్రి, యాదాద్రి ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తికి పట్టువస్త్రాలను అందజేశారు. సాయంత్రం నిర్వహించిన వైభవోత్సవ కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దంపతులు యాదాద్రీశుడికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం వైభవోత్సవ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఈవో ఎన్. గీత పాల్గొన్నారు.
నేత్రపర్వంగా..
యాదాద్రి బాలాలయ మండపంలో ఉదయం 11.06 గంటలకు తిరుకల్యాణం ప్రారంభమైంది. పట్టువస్త్రాలు, స్వర్ణ, వజ్రవైఢూర్య, ముత్యాల ఆభరణాలతో నవ వరుడిగా అలంకృతుడైన లోక కల్యాణకారకుడు నారసింహుడు గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా, భక్తజన కోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని పుష్పాలపల్లకిలో కల్యాణ వేదికకు తీసుకువచ్చారు. లక్ష్మీనరసింహుల కల్యాణ వేడుకలకు పాంచారాత్రాగమశాస్త్రం ప్రకారం దేవతల సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలిపూజలతో శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్లకు రక్షాసూత్రధారణ చేసిన అర్చకులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామివారికి యజ్ఞోపవీతధారణ తంతు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు నృసింహుడికి పాదప్రక్షాళన చేయగా, అర్చకులు వేదమంత్ర పఠనాలతో జీలకర్ర, బెల్లం తంతు నిర్వహించారు. మధ్యాహ్నం 1.12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో అమ్మవారి మెడలో స్వామివారు మాంగళ్యధారణ చేశారు. కల్యాణ మహోత్సవాన్ని యజ్ఞికులు శేషం ప్రణీతాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని శ్రీరామ అలంకరణలో తీర్చిదిద్ది హనుమంత వాహనంపై వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. రామో విగ్రహవాన్ ధర్మః అని లోకోక్తి. రామచంద్రుడి ప్రతాపం, శరణాగతత్రాణ పారాయణం, ఏకపత్నీ వ్రత దీక్ష, ధర్మపాలన వంటి సకలగుణ సంపన్నుడు రామచంద్రుడిని, క్షేత్రపాలకుడు హనుమంతుడి వాహనంపై అధిష్టించారు.
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో తాగునీటి పంపిణీ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలోగిల్లు డెవలపర్స్, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో భక్తులకు దాహర్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం యాదాద్రి కొండపై, సాయంత్రం కొండకింద పాత హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు మంచినీటిని అందజేశారు. కార్యక్రమంలో శ్రీలోగిల్లు డైరెక్టర్ వంటేరు సురేశ్రెడ్డి, వాకిటి మధుసూదన్రెడ్డి, నమస్తేతెలంగాణ బృందం పాల్గొన్నారు.