JNTU | యూనివర్సిటీలో కొత్త కోర్సులతో ప్రయోగాలు చేయడంపై జేఎన్టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్రంలోనే యూనివర్సిటీ ముందంజలో ఉంది. గత నాలుగేండ్ల కిందటే జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏఐఎంల్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు అందిస్తున్నది. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే దాదాపు 150 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో కూడా ఇలాంటి సరికొత్త కోర్సులను ప్రవేశ పెట్టడానికి యూనివర్సిటీ అనుమతులు మంజూరు చేసింది. అందుకనుగుణంగా టీచింగ్ ఫ్యాకల్టీని సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అన్ని రకాల అఫిలియేషన్ కాలేజీలలో ఏఐఎంల్, డాటాసైన్స్ వంటి నూతన ఐటీ కోర్సుల ప్రాధాన్యతను పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా తెలిసే విధంగా ప్రచారం కల్పించింది.
టెక్నాలజీ కోర్సులో బీబీఏకు అవకాశం
టెక్నాలజీ కోర్సులకు భిన్నంగా ఉండేలా జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)ను ప్రవేశ పెట్టారు. కేవలం యూనివర్సిటీ క్యాంపస్లోనే కాకుండా అఫిలియేషన్ కాలేజీలలో కూడా బీబీఏ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చి విజయవంతం చేశారు. అయితే బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు బీబీఏ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డ్యుయల్ కోర్సులు చేయడానికి వీలుగా బీబీఏను అందుబాటులోకి తీసుకువచ్చారు. బీటెక్తో పాటు బీబీఏ డ్యుయల్ డిగ్రీలు పూర్తి చేయడంతో సాఫ్ట్వేర్ రంగంలో విస్త్రత స్థాయిలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులు..
జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఉన్న స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా మూడు నెలలు, ఆరు నెలల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీటెక్లో సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కంప్యూటర్ సంబంధం లేకుండా ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు, లేదా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ప్రస్తుతం వివిధ ఉద్యోగాలలో ఉన్న వారి సౌకర్యం కోసం ఏఐఎంల్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, డాటాసైన్స్ వంటి పలు రకాల కోర్సులు పూర్తి చేసుకునే విధంగా డిప్లొమా కోర్సులను ప్రవేశ పెట్టారు. ఈ కోర్సులను పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. దీని ద్వారా ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్ పూర్తి చేసిన వారు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపికయ్యే విధంగా ఈ నూతన కోర్సులను రూపొందించారు. దీంతో యూనివర్సిటీ ఆదాయ మార్గాలు మెరుగు పడుతున్నాయని, భవిష్యత్తులో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఇలాంటి సరికొత్త టెక్నాలజీ కోర్సులలో ప్రవేశాలు పొందడానికి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు.