భోపాల్ : కరోనా మరణాల పెరుగుదలపై మధ్యప్రదేశ్ మంత్రి ప్రేంసింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వయసు మీద పడితే మరణిస్తారని, దీన్ని ఎవరూ అడ్డుకోలేమని వ్యాఖ్యానించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లో కొ విడ్ మరణాల పెరుగుదలపై ప్రశ్నించగా ..రోజూ పలువురు మరణిస్తున్నారని మీరు అడుగుతున్నారు..జనం వయసు పెరుగుతున్న కొద్దీ మరణిస్తుంటారని, ప్రజలు వయసు మీరితే ప్రాణాలు కోల్పోతారని పటేల్ బదులిచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలవుతుంటే బీజేపీ నేత ఒకరు ఇటీవల జన్మదిన వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడం విమర్శలకు తావిచ్చింది.