హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో శుక్రవారం ‘అమృత భారతి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు కేవీ రమణచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి సంగీత భాండాగారం నుంచి 75 సుప్రసిద్ధ దేశభక్తి గీతాలను ఎంపిక చేసి తయారుచేసిన సీడీని ఆవిషరించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న వ్యాఖ్యాత అంబడిపూడి మురళీ కృష్ణ – యశోద కృష్ణ దంపతులను సన్మానించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ విభాగం అధిపతి వి.ఉదయశంకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయడంలో ఆకాశవాణి తన వంతు పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వీఎస్సార్ మూర్తి, వింగ్ కమాండర్ ఎంవీఎల్ నారాయణ, సహాయ సంచాలకులు సీఎస్ రాంబాబు, కార్యక్రమ నిర్వాహకులు విజయ రాఘవరెడ్డి, నకా సుధాకర్, పాల్ రాజ్ శేఖర్, గోపీచంద్, సందీప్, కార్యవర్థి తదితరులు పాల్గొన్నారు.