సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): మద్యం (వైన్స్) దుకాణానికి సంబంధించిన కలెక్షన్ డబ్బుతో ఉడాయించిన ఓ వ్యక్తిని బుధవారం కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి, రూ. 22.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా వంకమామిడి గ్రామానికి చెందిన సునీల్ మౌలాలీ హౌజింగ్ బోర్డు కాలనీలోని సాయిదుర్గా వైన్స్లో కలెక్షన్ బాయ్గా మూడేండ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు వైన్స్ వద్దకు వెళ్లి, రాత్రి 10 గంటల సమయంలో క్యాష్ను తీసుకుని చైతన్యపురిలో ఉంటున్న యజమాని మన్నె శ్రీధర్రెడ్డికి అప్పగిస్తాడు. గతనెల 31న వైన్స్ దుకాణం నుంచి రూ.22 లక్షలు కలెక్షన్ డబ్బును తీసుకుని రాత్రి 10 గంటలకు బయలు దేరాడు.
రాత్రి 11.30 గంటలు దాటినా సునీల్ ఇంటికి చేరుకోకపోవడంతో యజమాని మన్నె శ్రీధర్రెడ్డి ఫోన్ చేశాడు. 2 నిమిషాల్లో వస్తున్నానని చెప్పి.. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్లో పెట్టాడు. అనుమానం వచ్చి వైన్స్ షాపు మరో పార్టనర్ కుషాయిగూడ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సునీల్ కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న అతడు మంగళవారం రాత్రి తిరిగి వచ్చి నగదును పోలీసులకు అప్పజెప్పాడు. అందులో రూ.28 వేలు వాడుకున్నట్లు అంగీకరించాడు. పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. సునీల్ గతంలో పలు వ్యాపారాలు చేసి, దాదాపు రూ. 60 లక్షలు నష్టపోయాడు. ఆ అప్పులను తీర్చేందుకు ముందస్తుగా పథకం వేసి నేరానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసింది.