కేపీహెచ్బీ కాలనీ, జూలై 16 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్, కార్పొరేటర్లు, ఉద్యానవన విభాగం అధికారులతో హరితహారంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని.. ప్రతియేటా కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ యేడాది హరితహారంలో భాగంగా భారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు.. ఇందులో కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. మల్టీలెవల్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, చెరువుల బఫర్ జోన్లు, శ్మశానవాటికలు, రోడ్డు పక్కన ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో భారీగా మొక్కలు నాటేలా చర్య లు తీసుకోవాలన్నారు.
కాలనీలు, బస్తీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలకు, ప్రజలకు హరితహారం కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు అందుబాటులో నర్సరీలు ఉన్నాయని.. మొక్కలు నాటాలన్న ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే విరివిగా మొక్కలు నాటి.. పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజా ప్రతినిధులు.. ప్రజలను చైతన్యవంతులను చేసి .. మొక్కలు నాటే ఉద్యమంలో భాగస్తులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే హరితలక్ష్యం నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఏఈలు రంజిత్, శ్రీనివాస్, పవన్, ఉద్యానవన శాఖ సిబ్బంది సమత, విజయశ్రీ, ఆంజనేయులు, కార్పొరేటర్లు శిరీషాబాబురావు, సబీహాబేగం, మహేందర్, అధికారులు పాల్గొన్నారు.