జూబ్లీహిల్స్,సెప్టెంబర్2 : యూసుఫ్గూడ సర్కిల్లోని కృష్ణకాంత్ పార్క్ ఆధునీకరణకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం బల్దియా బృందం పార్కులో పర్యటించి సమస్యలపై సర్వే చేపట్టారు. పార్కులో మౌలిక వసతుల మెరుగుకు చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ బయోడైవర్సిటీ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్, శేరిలింగంపల్లి సూపరింటెండెంట్ ఇంజినీర్ చిన్నారెడ్డి తెలిపారు.
యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్ అధికారులతో కలిసి ఆయన పార్కులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో వాకర్స్తో పాటు సందర్శకులకు నాణ్యమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత్వేలలో, లాన్లలో దేదీప్యమైన విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం, టాయిలెట్ల సౌకర్యాలు మెరుగు పరచడం, కొత్తగా కుర్చీలు ఏర్పాటుచేయడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించారు.
కృష్ణకాంత్ పార్కులో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పార్కులో సమస్యలను యూసుఫ్గూడ సర్కిల్ ఈఈ రాజ్కుమార్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో యూబీడి ఫీల్డ్ అసిస్టెంట్ అలీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.