గోల్నాక, ఆగస్టు 31 : పాఠశాలల్లో ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఈ నెల మొదటి వారం నుంచి అన్ని పాఠశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉండటం నేపథ్యంలో మంగళవారం గోల్నాక తులసీనగర్ భారతి విద్యాభవాని పాఠశాలలో డీఈవో శ్రీధర్, డిప్యూటీఈవో నిజాంఉద్దీన్తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని దీంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి తరగతి గదితో పాటు పాఠశాల ఆవరణల్లో శానిటైజేషన్ పనులు చేయించాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా తరచూ చేతులను శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ నిబంధనలపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, కన్నె ఉమ, బి.పద్మ, అమృత, పలు ప్రైవేటు పాఠశాలలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.