పండ్ల మార్కెట్ తరలించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఒకనాడు శివారు ప్రాంతంగా ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఏరియా నేడు కాలనీగా మారింది. దీంతో పండ్ల మార్కెట్ను అక్కడి నుంచి తరలించాలన్న డిమాండ్ గత 15 ఏండ్లుగా వస్తుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రస్తుతం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ యార్డ్ స్థలంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్ను తరలించే అంశం సుగమం అయ్యింది.
ఎల్బీనగర్, ఆగస్టు 4 : గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్ను కోహెడలో ఏర్పాటు చేసేందుకు సుమారు 178 ఎకరాల స్థలాన్ని గతంలోనే కేటాయించారు. మార్కెట్ కమిటీ ఆ ప్రాంతంలో అధునాతన పండ్ల మార్కెట్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలు సాగుతున్న క్రమంలోనే గడ్డిఅన్నారంతో పాటుగా హైదరాబాద్ నగరం నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డును సందర్శించారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో ప్రభుత్వం ఆస్పత్రి భవన నిర్మాణం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కు ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు లాజిస్టిక్ పార్కు ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేసేందుకు ఉన్న అవకాశాలను వారు పరిశీలించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న సౌకర్యాలకు అదనంగా మరికొన్ని సౌకర్యాలను కల్పించి రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా లాజిస్టిక్ పార్కు ప్రాంతంలో తాత్కాలిక మార్కెట్ను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులతో పాటుగా అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
కొత్తపేట గడ్డిఅన్నారంలోని సుమారు 22 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ యార్డు తొలుత హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉండేది. అనంతరం గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించేందుకు సిద్ధమైన అధికారులు తాత్కాలిక మార్కెట్ను బాటసింగారంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పండ్ల మార్కెట్ యార్డుకు వ్యాపార లావాదేవీలు ఉత్తరాది రాష్ర్టాలతో ఉన్నందున ఆ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు ఉంటాయి. వారికి ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోని బాటసింగారంలో అయితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవనే భావనతో అధికారులు ఉన్నారు. అంతేకాక ఈ ప్రాంతంలో ఓ ఆస్పత్రి, పెట్రోల్ బంక్తో పాటు ఇతర కొన్ని సౌకర్యాలు ఉన్నందున లాజిస్టిక్ పార్కు అయితేనే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డు వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు గత మూడు, నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పండ్ల మార్కెట్ తరలింపు అంశం ఒక ఎన్నికల హామీగా మారింది. ఉమ్మడి రాష్ర్టాంలో టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మార్కెట్ తరలింపు హామీలు ఇచ్చినప్పటికీ దానిని నెరవేర్చలేకపోయాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండ్ల మార్కెట్ తరలింపుపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడంతో పాటుగా తరలింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎన్నికల హామీ కాస్తా వాస్తవ రూపంలోకి రానున్నదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోహెడలో పండ్ల మార్కెట్ కోసం నిర్ణయించిన స్థలంలో మార్కెట్ను అధునాతన హంగులతో నిర్మించిన అనంతరం తాత్కాలికంగా కేటాయించిన లాజిస్టిక్ పార్కు ప్రాంతం నుంచి కోహెడకు మార్కెట్ను తరలిస్తారు. అధికారులు ఇప్పటికే కోహెడలో మార్కెట్ నిర్మాణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయం నేపథ్యంలో మార్కెట్ను తరలింపును వేగవంతం చేయనున్నారు.